Pawan Kalyan: అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర ఈ గిరిప్రదక్షిణ మార్గాన్ని నిర్మించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల ద్వారా రూ.3.40 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. శ్రీరామ నవమికి ముందే భక్తులకు ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం రాళ్లు, ముళ్లతో నిండిపోయి ఉండేది. అయినప్పటికీ భక్తులు ఎంతో కష్టపడి ప్రదక్షిణ చేసేవారు. ఈ సమస్యలను స్థానిక ప్రజలు, ఎమ్మెల్యే లోకం మాధవి దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం స్పందించి, మార్గాన్ని సౌకర్యవంతంగా మార్చింది.
Modi-Trump: ట్రంప్కు మోడీ ఎందుకు గుర్తుకొచ్చినట్లు.? వెనక పాకిస్తాన్ కోణం..
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. గత 20 నెలల్లో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, ఇతర నిధుల ద్వారా రూ.40 కోట్లకు పైగా వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం గిరిప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, అలాగే కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గానికి రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు.
రామతీర్థం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో రామాయణ, మహాభారత కాలానికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారు.
