తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుదే తప్పని చెప్పానన్నారు. టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని, కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
‘గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడింది. లడ్డూ కల్తీపై నేను దీక్ష చేశాను. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలింది. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ విషయంలో ఏమి చెయ్యాలో ఆలోచించా. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేనెక్కడా చెప్పలేదు, గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పాను. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం ఉండేది కాదు. గత టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చింది’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
‘ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉందని చెప్పారు. రసాయనాల్లో అసలు ఏముందో దేవుడికే తెలియాలి. దీని నుంచి ఎవరు లబ్ధి పొందేది. ఇది హిందూ మతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారు. అన్ని విషయాల్లో పాలక మండలి బాధ్యత తీసుకోవాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రసంగం చివరిలో ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణ దేవరాయుల పద్యాన్ని పవన్ చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితిని ఆయన వివరించారు.
