తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే టెన్నల్ దగ్గర ఇప్పటికే మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మృతదేహాలను గుర్తించి అధికారులు బంధువులకు అప్పగించనున్నారు.
మరోవైపు ప్రమాద స్థలం వరకు లోకో ట్రాక్ను జైపీ కంపెనీ సిద్ధం చేస్తోంది. ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు ఉన్నాయి. ఇక్కడే టీబీఎం సగ భాగం కూరుకుపోయింది. మట్టిని బయటకు తరలించేందుకు మ్యానువల్గా సాధ్యం కాకపోవడంతో లోకోను అక్కడి వరకు తెచ్చే ప్రయత్నం చేస్తు్న్నారు. కన్వేయర్ బెల్టు కూడా అందుబాటులోకి వచ్చింది. 12వ కిలోమీటర్ నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన మీటరున్నర మట్టిని రెస్క్యూ టీమ్స్ ఎత్తి పోస్తున్నాయి. లోకోను 13.5 కిలోమీటరు వరకు తీసుకొచ్చి మట్టిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.