NTV Telugu Site icon

Crime News: రూ.9వేల కోసం బావా బావమరిదిల మధ్య వివాదం.. ఒకరి హత్య, మరో ముగ్గురికి కత్తిపోట్లు

Crime News

Crime News

Crime News: కేవలం రూ.9వేల రూపాయలకోసం బావ బావమరిదిల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువురి తరపున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా, మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. దాడికి పాల్పడ్డ 18మంది నిందితుల్లో 12మందిని శాలిబండా పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. పురాణా హవేలిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో సౌత్​ జోన్​ డీసీపీ స్నేహ వివరాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన మజర్​, సోహైల్‌లు బావ బావమరిదిలు. గత కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మజర్​ సోహైల్​ వద్ద రూ.9వేల రూపాయలను అరువుగా తీసుకుని సతాయిస్తున్నాడు.

Read Also: Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..

దీంతో ఈ నెల 18వ తేదీన రాత్రి పాతబస్తీ మక్కా కాలనీలోని ఫ్యాన్సీ చికెన్​ సెంటర్‌లో డబ్బుల విషయమై వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్త చిలికి చిలికి హింసాత్మకంగా మారింది. సోహైల్​ తరపున వచ్చిన వాజిద్‌పై మజర్​ వర్గీయులు కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్​ 14 కేసులలో నిందితుడైన మొహమ్మద్​ అసద్​ (35), నాలుగు కేసులలో నిందితుడైన హుస్సేన్​ పాషా అలియాస్​ అషు (23), మొహమ్మద్​ సుభాన్​ ఖాన్​(20), మొహమ్మద్​ అన్వర్​ అలియాస్​ అన్న (34), మేషాన్​ బిన్​ సమద్​ మిశ్రీ (32), ఇమ్రాన్​, గౌస్​ , మొహ్మద్​ అబ్నాన్ ఉద్దీన్​ (26), సోహైల్, మొహమ్మద్​ ఇస్మాయిల్​ అలియాస్​ ఖుర్రం (37), సైఫ్​ ఆలీఖాన్​ అలియాస్​ అర్బాస్​ (21), అబ్దుల్లాఖాన్​ (18), షేక్​ దస్తగిర్​ (20), సయ్యద్​ యాకుబ్​ ఆలీ (19), ఉస్మాన్​ బిన్​ ఖాళీద్​ యామని (22), అమన్​ ఆలీ హాష్మి (18), దస్తగిరిలు​ కత్తులతో అటాక్​ చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వాజిద్‌కు సహాయం చేయడానికి అతని సోదరులు సాజిద్​, ఖదీర్‌​లు అక్కడికి వచ్చారు. వాళ్లపై కూడా కత్తులతో దాడిచేశారు. ఆ సమయంలో ఫాతిమా ఆసుపత్రి దగ్గరి నుంచి వెళ్తున్న సయ్యద్​ ఫకృద్దీన్​ అలియాస్ రఫిక్ ​అలియాస్​ ​ షిమ్లాన్​ పైన కూడా కత్తులతో దాడికి తెగబడ్డారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సయ్యద్​ ఫకృద్దీన్​ అక్కడిక్కడే మృతిచెందగా, వాజిద్​, సాజిద్​, ఖదీర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 18మంది పై శాలిబండా పోలీసులు కేసులు నమోదు చేశారు. 18మందిలో 12మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు.