ఆ జిల్లాలో తమ్ముళ్ళను తగ్గమని తలంటేశారా? మరీ… ఓవర్ స్పీడ్ అయిపోవద్దని టీడీపీ పెద్దల నుంచి వర్తమానం అందిందా? మిమ్మల్ని ఎలా సెట్ చేయాలో మాకు తెలుసునంటూ వార్నింగ్లు సైతం వచ్చాయా? ఎక్కడి టీడీపీ నేతలకు ఆ స్థాయి వార్నింగ్స్ ఇచ్చారు? ఎందుకా పరిస్థితి వచ్చింది? కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్ళు కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవుల పందేరంలో తమను పక్కనపెట్టి జనసేనకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బహిరంగంగానే బరస్ట్ అవుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టిందట. అదుపు… అదుపు… మాట పొదుపు అంటూ…వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఏదన్నా ఉంటే… పార్టీ దృష్టికి తీసుకురావాలి గానీ…పరిధి దాటితే ఎలా? ఒకవేళ మాట వినకుంటే…. ఏం చేయాలో కూడా మాకు తెలుసునని సీరియస్ వార్నింగే ఇచ్చారట పార్టీ పెద్దలు. ఈ విషయంలో జూనియర్స్ మాట్లాడారంటే ఏకే… ఏదో ఉడుకు రక్తం, పార్టీ పద్ధతుల గురించి పూర్తి అవగాహన వచ్చి ఉండకపోవచ్చని అనుకోవచ్చు. కానీ… అన్నీ తెలిసిన సీనియర్లు కూడా సన్నాయి నొక్కులు నొక్కితే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదని వర్తమానం పంపినట్టు సమాచారం. మరోసారి అలా మాట్లాడితే… సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు తెలిసింది. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు త్యాగాలు చేయాలని, అవసరాల దృష్ట్యా సర్దుకుపోవాలని, అలా కాదని మరీ స్పీడ్ అయిపోతే కష్టమని జిల్లా నాయకులకు టీడీపీ పెద్దలు తలంటేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా… ఎవరు ఏం మాట్లాడారో… ఆరా తీసిమరీ… అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారట.. పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్నిచోట్ల రాజీపడక తప్పదని చెప్పినట్టు సమాచారం. అలా కాదని మీరేదన్నా ఇబ్బందిగా ఫీలైతే మాత్రం మీ నిర్ణయాలు మీరు తీసేసుకోవచ్చని కూడా… క్లారిటీ ఇచ్చేసినట్టు తెలిసింది. పొత్తుల కోణంలో పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అవేమీ పట్టనట్లు సొంత ప్రయోజనాల కోసం మాట్లాడితే మాత్రం మేటర్… వేరే విధంగా ఉంటుందని చెప్పారట.
అయితే…హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనపై జిల్లాలోని తమ్ముళ్ళు కూడా తగ్గకుండా రియాక్ట్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే తాము మాట్లాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతాం… ఇందులో మాకు వచ్చిన ఇబ్బంది ఏం ఉంటుందని అంటున్నట్టు తెలుస్తోంది. జనసేన జిల్లా అధ్యక్షుడికి రెండు పదవులు అవసరమా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కామెంట్ చేశారు. అయితే… ఆయన టీటీడీ బోర్డ్ సభ్యుడిగా కూడా ఉన్నారు. మరి నెహ్రూ రెండు పదవులు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు జిల్లాలో. అయినా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఒక పదవికి రాజీనామా చేస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారట. వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలలో తలదూర్చి లేనిపోని వివాదాలు సృష్టించవద్దని టీడీపీ పెద్దలు తమ నాయకులకు చెబుతున్నారట. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేతో పిల్లి అనంతలక్ష్మికి ఇబ్బంది ఉంటే… పార్టీ దృష్టికి తీసుకురావాలని, అనవసరంగా రోడ్డెక్కవద్దని చెప్పినట్టు తెలిసింది. మహానాడు తర్వాత మొత్తం సెట్ చేస్తామని క్లారిటీ ఇచ్చేశారట టీడీపీ పెద్దలు. అప్పటిదాకా… కెలికి రచ్చ చేయవద్దని నేరుగా చెప్పాల్సింది చెప్పేశారట టీడీపీ ముఖ్యులు. జిల్లా నేతలు కూడా మేం చెప్పింది కూడా పార్టీ మంచికోసమేకదా అని వివరించే ప్రయత్నం చేస్తున్నా… ఇక చెప్పిన వరకు చాలని అన్నట్టు తెలిసింది. పార్టీ నిర్ణయాలను అమలు చేయడమేగానీ…. వివాదాలు తీసుకురావద్దని స్పష్టత వచ్చిందట. మొత్తానికి కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్లకు పార్టీ పెద్దలు లైన్ గీశారు.. మరీ స్పీడ్ అయిపోయి వ్యవహారాన్ని జటిలం చేయొద్దని చెప్పేశారు. దాంతో ఇలాంటి రిప్లై ఊహించక తమలో తామే మధనపడుతున్నారట సైకిల్ నాయకులు. పార్టీ పెద్దలు దీన్ని ఎలా క్లోజ్ చేస్తారో చూడాలి మరి.