పాలకుర్తి కాంగ్రెస్లో రచ్చకు కారణం ఎవరు? సొంత పార్టీ నేతలేనా? లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? కాంగ్రెస్లో ఉంటూ పక్క పార్టీకి కోవర్ట్లు పనిచేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం ఎంత? ఇంతకూ ఆసలు పాలకుర్తి కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఓ రేంజ్లో జరుగుతోంది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా మొదలైన ఫిర్యాదుల పరంపర గాంధీ భవన్ వరకు చేరింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి పొలిటికల్ సీనియర్ని ఢీకొని, గత ఎన్నికల్లో ఓడించిన అత్తా కోడళ్లకు వ్యతిరేకంగా పాలకుర్తి కాంగ్రెస్లో పనిచేస్తోంది ఎవరన్న చర్చ మొదలైంది. వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా కొంతమంది ఇటీవల గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేసి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్కి కూడా లేఖ రాశారట. వాస్తవానికి పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డితో పోటీ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు లేరు. అయినాసరే… హైకమాండ్కు పనిగట్టుకుని ఫిర్యాదులు వెళ్తున్నాయంటే… ఎక్కడో ఏదో జరుగుతోందన్న డౌట్స్ పెరుగుతున్నాయట. దీని వెనుక అసలు కథ వేరే ఉందనేది అత్తా కోడళ్ల ఆరోపణ. బీఆర్ఎస్కు చెందిన అదృశ్య శక్తి కాంగ్రెస్లోని కొంతమందిని చేరదీసి ఫిర్యాదులు చేయిస్తున్నారని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు ఈ అత్తా కోడళ్ళు. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి ఉంటే… నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జిగా ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. స్వయానా అత్తా కోడళ్ళయిన వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… ఇన్ఛార్జ్ అయిన అత్త ఏం చెబితే.. ఎమ్మెల్యే అయిన కోడలు అదే పని చేస్తారన్నది లోకల్ వాయిస్. అదే సమయంలో వీళ్ళని ఢీకొట్టే స్థాయి కాకున్నా… నియోజకవర్గ కాంగ్రెస్ సెకండ్ కేడర్లో అసంతృప్తి పెరుగుతోందట.
ఎమ్మెల్యే మీద చాలా ఆశలు పెట్టుకున్నా…. ఏ పనీ జరక్కపోవడమే అందుకు కారణం అంటున్నారు. అందుకే గ్రూప్ రాజకీయం పెరుగుతున్నట్టు సమాచారం.
సరిగ్గా… ఇక్కడే మాజీ ఎమ్మెల్యే దయాకర్రావు ఎంటరైనట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న కొంతమంది నేతలను చేరదీసి మా మీదికి ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తోంది ఎమ్మెల్యే వర్గం. ఇదిలాఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండల అధ్యక్షుడిని తొలగించి, ఇంకో వ్యక్తికి అప్పగించడంతో పాలకుర్తి హస్తం పార్టీలో రచ్చ మొదలైంది. ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చుతున్నారంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలో పెద్ది కృష్ణమూర్తి వర్గీయులు అత్తా కోడళ్ళకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట ఆందోళన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. స్వార్ధ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వారిని ఝాన్సీ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా అత్తా కోడళ్ళ తీరుపై పాలకుర్తి కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. మార్పు కోసం ఓటు వేస్తే కనీసం తమను ఎమ్మెల్యే ఝాన్సీరెడ్డి పట్టించుకోవట్లేదని, ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించి భరోసా ఇచ్చేందుకు సైతం తమ నాయకురాలు రావట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాయట పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులు. అయితే… ఎలాంటి అసంతృప్తి లేదని, ఇదంతా మాజీ ఎమ్మెల్యే తమ పార్టీలోని కొంతమందిని చేరదీసి తోలుబొమ్మలాట ఆడిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే. ఏదేమైనా… నిప్పులేనిదే పొగరాదంటారు. పాలకుర్తి కాంగ్రెస్ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.