Hyderabad: హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ఫ్ ఎన్ క్లిప్లో ప్రొఫెసర్ విజయ లక్ష్మీ, మురళి మోహన్ దంపతులను కాళ్ళుచేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు నేపాలీలతోపాటు, మరో ఐదు మంది కలిపి దోపిడీ చేశారు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి, 30 వేలు నగదు దోపిడీ చేశారు. 13 రోజుల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరి దోపిడీ చేసింది ఈ నేపాలీ గ్యాంగ్. దోపిడీ సమయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
అసలు ఏం జరిగిందంటే?
సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలను ఇంట్లో చేసుకుంటామని అడగటంతో ప్రొఫెసర్ విజయ లక్ష్మీ, మురళి మోహన్ దంపతులు అంగీకరించారు. రాత్రి బర్త్డే వేడుకల పేరుతో ఇంట్లోకి మరో ముగ్గురు వచ్చారు. అనంతరం బర్త్డే కోసం ప్రొఫెసర్ దంపతులు కేక్ కోపించారు. వేడుకల పేరుతో ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేశారు. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేశారు. దంపతులను బెదిరించి చేతులు కట్టేశారు. “మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి” అంటూ ఆ దంపతులు వేడుకున్నారు. దీంతో ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకున్నారు. దోపిడీ అనంతరం దంపతులకు మత్తుమందు ఇచ్చి గదిలో బంధించారు. మత్తు ప్రభావంతో నిన్న మధ్యాహ్నం వరకు తేరుకోలేదు. మత్తు నుంచి తేరుకుని కిటికీ నుంచి అరవడంతో స్థానికులు తలుపులు తెరిచారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను రక్షించారు. ఈ విషయం తెలుకుని మల్కాజిగిరి సీపీ సుమతి ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్, పనిమనుషుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
