Nandamuri Balakrishna: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసింది.. నంద్యాలలో ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి.. విజయవాడకు తరలిస్తున్నారు సీఐడీ అధికారులు.. ఇక, చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.. తాజాగా, చంద్రబాబు అరెస్ట్పై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ మీరో నందమూరి బాలకృష్ణ.. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడు.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం.. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారు అని మండిపడ్డారు..
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ఓ ప్రకటనలో నిలదీశారు బాలకృష్ణ.. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న ఆయన.. ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైంది, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు చేయలేదు? డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఇక, 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? అని ప్రశ్నించారు బాలకృష్ణ.. మళ్లీ తప్పల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు అని ఎద్దేవా చేశారు.. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు? ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు టాలీవుడ్ హీరో.. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ.