ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. గజ్వెల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారని సిబ్బంది తెలిపారు. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.
READ MORE: Revanth Reddy: రాష్ట్ర గీతంగా “జయ జయహే తెలంగాణ” ..ఆవిర్భావ వేడుకల్లో జాతికి అంకితం
మరోవైపు రాష్ట్రంలో లోగో లొల్లి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో మార్పు వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అది రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని సర్కారు భావిస్తోందని బీఆర్ ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.