Children Hostage Mumbai: ముంబైలో గురువారం సంచలన ఘటన వెలుగు చూసింది. నగరంలో పట్టపగలు పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు కేసు నమోదు కావడం కలకలం రేపింది. ముంబైలోని ఆర్ఏ స్టూడియోలో మొదటి అంతస్తులో ఈ సంఘటన జరిగింది. స్టూడియోలో పనిచేస్తూ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రోహిత్ 20 మంది పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు కేసు నమోదు అయ్యింది. మొత్తం 100 మంది పిల్లలు ఆడిషన్ల కోసం వచ్చినట్లు సమాచారం.
READ ALSO: Hyderabad: 5.04 కి.మి మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు షురూ.. ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్..!
నాలుగు అయిదు రోజులుగా ఆడిషన్లు..
పలు నివేదికల ప్రకారం.. ఈ స్టూడియోలో ఆయన గత నాలుగైదు రోజులుగా ఆడిషన్లు నిర్వహిస్తున్నాడు. గురువారం ఆడిషన్ల కోసం వచ్చిన సుమారు 100 మంది పిల్లల్లో దాదాపు 80 మందిని బయటికి పంపించారు. కానీ మిగిలిన పిల్లలను ఒక గదిలో బంధించారు. బందీలుగా ఉన్న పిల్లలు కిటికీల నుంచి బయటకు చూస్తున్నట్లు కనిపించడంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్టూడియోను చుట్టుముట్టి, నిందితుల గుర్తింపు, వారి ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పిల్లలను రెస్క్యూ చేసిన పోలీసులు..
ప్రస్తుతం స్టూడియో వెలుపల హై అలర్ట్ అమలులో ఉంది. బందీలుగా ఉన్న పిల్లలను పోలీసులు, రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి. పిల్లలను రక్షించిన అనంతరం పోలీసులు రోహిత్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పిల్లల బందీ నుంచి విడిపించడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.