Site icon NTV Telugu

MS Dhoni: ధోనీ అప్పుడే మొదలెట్టేశాడుగా.. ఫ్యాన్స్ ఖుషీ

Dhoni

Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2023 కోసం అప్పుడే ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. గ్రౌండ్‌లో దిగి బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ ప్రాక్టీస్‌తో చెమటోడ్చాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతుండటంతో అతడిని ఇలా మైదానంలో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Also Read : High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు.. విచారణ ఈనెల 27 కు వాయిదా

నిరుడు ఐపీఎల్‌కు ముందే ధోనీ ఈ మెగాలీగ్‌ నుంచి తప్పుకొంటాడన్న వార్తలు వచ్చాయి. కానీ వాటన్నంటికీ సమాధానం చెబుతూ గతేడాది మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. కాగా, ఆటగాడిగా ధోనీకి ఈ ఐపీఎల్ చివరిదని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే లీగ్‌లో ధోనీ ఆడటం దాదాపు అసాధ్యమే. అసలు ఈ ఏడాదే అతడు తప్పుకోవాల్సింది. అయితే తన చివరి మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలని ఉందని, అక్కడ ఆడిన తర్వాతనే రిటైర్‌మెంట్ తీసుకుంటానని మహీ గతంలోనే చెప్పాడు. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతడు తన చివరి మ్యాచ్ ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా సీఎస్కే జట్టుతోనే ధోనీ ఉంటాడని, మెంటార్‌గానో లేక కోచ్‌గానో బాధ్యతలు నిర్వర్తిస్తాడని సమాచారం.

Also Read : Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

గతేడాది ధోనీ పెర్ఫామెన్స్ బాగున్నా చెన్నై మాత్రం పెద్దగా రాణించలేదు. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. గత సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై కెప్టెన్సీకి ధోనీ వీడ్కోలు పలికాడు. అతడి నుంచి రవీంద్ర జడేజా ఈ టీమ్ పగ్గాలు స్వీకరించాడు. కానీ జడ్డూ కెప్టెన్‌గా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అనంతరం సీజన్ మధ్యలోనే అతను కూడా కెప్టెన్సీని వీడగా.. మళ్లీ ధోనీనే సారథిగా వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version