కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై లోక్సభ అనర్హత వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. వారికున్న సొంత ఆస్తులను, వేలకోట్ల రూపాయిలు స్వాతంత్య్రం కోసం దారపోసిన కుటుంబం గాంధీది అని ఆమె అన్నారు. ఈ దేశం కోసం దివంగత ప్రధాని ఇందిరమ్మ తన ప్రాణాలిచ్చిందని, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆమె అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్లు గడుస్తున్నా ప్రధాని స్థానంలో కూర్చోలేదని ఆమె వ్యాఖ్యానించారు. సింగరేణి, బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలు నెలకొల్పారని, కానీ మీరు రైల్వేలు, ఎయిర్ పోర్టులు, షిప్పింగులను మీరు మీ దోస్తులకు దోచిపెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ దోచుకుంటుంటే అడ్డుకుంటున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడోను అడ్డుకునే ప్రయత్నం చేశారని, లండన్ లో మాట్లాడిన మాటలను వక్రీకరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారన్నారు.
Also Read : Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?
మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయంటే నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు న్యాయస్థానాన్ని మ్యానేజ్ చేసి రాహుల్ గాంధీకి శిక్షపడేలా చేసి ఎంపీగా అనర్హత వేటు వేయించారని ఆమె దుయ్యబట్టారు. ఇవాళ కోర్టులంటే మాకు గౌరవం ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టులు, ఎలక్షన్ కమిషన్లు, ఈడీలు, ఐటీలు, సీబీఐలను తమ గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ తన తీర్పును ఆయా సంస్థల ద్వారా ప్రభావితం చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ చెప్పిందేమన్న పెద్ద తప్పా.. మోడీ ప్రభుత్వం హయాంలో అదానీకి 12 లక్షల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే..?
పాకిస్తాన్ కంటే మన ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోయిందని లోకం కోడై కూస్తుందని, ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రజాస్వామ్యంలో ఖూనీ చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రాహుల్ గాంధీపై కక్షసాధింపు చర్యేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై చేస్తున్న ఇటువంటి కక్షసాధింపు చర్యలు మోడీ ప్రభుత్వం మానుకోవాలని ఆమె హితవు పలికారు. ఏదైతే హిండెన్ బర్గ్ చెప్పిందో ఆదానీ ఆస్తులపై పార్లమెంట్ జాయింట్ కమిటి వేసి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.