నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇద్దరు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనాల్స్ తో పాటు.. పెండింగ్ లో ఉన్న SLBC టన్నెల్ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే SLBC కాలువలను పూర్తిచేసినప్పటికి, బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదని ఆరోపించారు. SLBC కాలువలకు మరియు వరద కాలువకు గత 10 సంవత్సరాల నుంచి మొయింటెనెన్స్ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగిందన్నారు. వీటికి మరమ్మత్తులు చేపట్టాలి, బెడ్ మరియు సైడ్స్ లైనింగ్ పనులను ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు క్రింద మొదటిదశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు భూసేకరణ చేపట్టడం, కాలువలను తవ్వే పనులను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
KH237: డైరెక్టర్స్ గా మారిన స్టంట్ మాస్టర్స్.. కమల్ తో సినిమా అధికారికం
గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మెజారిటీ పనులు పూర్తయిన SLBC ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని.. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం జిల్లా ప్రజల అదృష్టమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.