భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ, ఇతర అధికారులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నారాయణపురం, ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. ఆంధ్రా పరిధి కూడా ఉండడంతో అక్కడి ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని, పెద్దవాగు వరద ఉధృతితో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
READ MORE: Film Studio: ఏపీలో 100 ఎకరాల ఫిలిం స్టూడియో!!
కాగా.. ఐదుగురు పశువుల కాపర్లు.. 20 మంది కూలీలు వేరువేరు చోట్ల వరదల్లో చిక్కుకున్నారు. బచ్చువారిగూడెం బ్రిడ్జి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన ఐదుగురు.. అకస్మాత్తుగా వాగు పొంగడంతో తప్పించుకునేందుకు సమీపంలోని వేపచెట్టు ఎక్కారు. ఉండే కొలది వరద ఉధృతి పెరగడంతో.. వారు చెట్టు దిగి కిందకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తాము వరదలో చిక్కుకున్నట్లు సెల్ ఫోన్ ద్వారా స్థానికులకు సమాచారం అందించారు. బిక్కు బిక్కుమంటూ రక్షణ చర్యలు కోసం వేచి చూస్తున్నామని.. చెట్టు పైన తమ పరిస్థితిని వీడియో తీసి పంపించారు. అదేవిధంగా నారాయణపురం వాగు వరద ఉదృతం అవడంతో.. 20 మంది కూలీలు కట్ట మైసమ్మ ఆలయంలో తలదాచుకున్నారు. ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో తమని రక్షించాలంటూ ఫోన్లు చేసి వేడుకుంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే జారె నారాయణపురం వాగులో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ను ఘటన స్థలానికి పంపనున్నట్లు తెలిపారు. రక్షణ చర్యలో భాగంగా భద్రాచలం నుంచి బోటును రప్పించనున్నట్లు తెలిసింది.
READ MORE:Pushpa 2: ఏం పర్లేదు ఏం పర్లేదు.. అంతా ఓకే!
సీఎంఓతో సంప్రదింపులు జరిపిన తుమ్మల..
అశ్వారావుపేట మండలం నారాయణపురం వరద నీటి లో చిక్కిన వారిని రక్షించేందుకు సి.ఎం.ఓ.కార్యాలయం తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు. దీంతో పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న కూలీలను రక్షించేందుకు.. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం… హెలికాప్టర్ తో రెస్క్యూ టీమ్ తో కాపాడాలని ఆదేశాలు జారీ చేయగా ఇప్పటికే 15 మందికి పైగా రెస్క్యూ చేశారు.