బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్క నోటీసు జారీ చేశారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఈ లీగల్ నోటీసును పంపించారు.
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (TSTS) నిర్వహించిందని, టెండర్ ఈవాల్యుయేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ కేటాయించబడిందని నోటీసులో మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే మొత్తం టెండర్ విలువ రూ.44 కోట్లే ఉన్నప్పటికీ.. అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసంబద్ధమని, ఇవన్నీ పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణలని పేర్కొన్నారు. ఈ విధమైన ప్రచారం తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. 48 గంటలలోపు ఈ పోస్టులను తొలగించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేకపోతే తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని మంత్రి సీతక్క లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. మంత్రి సీతక్క నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.