రైతుల్ని పారిశ్రామిక వేత్తలను చేస్తాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, దీనిని సాధించేందుకు అండగా ఉంటామన్నారు. మహిళలు కూడా పరిశ్రమలు పెట్టి ఆదాయాన్ని ఆర్టించాలని, మహిళలను కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. పారిశ్రామిక పార్కులలో పరిశ్రమలను తెచ్చే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలిని .. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజావేదికపై సీఎం మాట్లాడారు.
‘అమరావతిలో భూములు ఇచ్చిన వారికి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తున్నాం, దీనివల్ల వారు కోటీశ్వరులు అవుతారు. ఎన్నో విద్యా సంస్థలకు భూములు ఇచ్చాం. నేను చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి ఏ రైతుకూ అన్యాయం చేయలేదు. అభివృద్ధిని సహించలేని కొందరు ఇబ్బందులు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో తరతరాలుగా వెనుకబడిన యానాది కుటుంబాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులను ఏర్పాటు చేస్తాం. వీటిలో పరిశ్రమలను తీసుకువస్తాం. వ్యవసాయం తర్వాత పారిశ్రామిక రంగంలో కూడా ఉపాధి అధికంగా లభిస్తుంది. ఈ పార్కులలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం. గతంలో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చాను. దానివల్ల ఎందరికో ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం ఏఐ వచ్చింది, భవిష్యత్తు కూడా దీనికే ఉంటుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ కింద అమరావతిలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో రీజనల్ హబ్లను ఏర్పాటు చేస్తున్నాం. విద్యాసంస్థలను, పరిశ్రమలను అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల ఎందరికో ఉపాధి వస్తుంది. యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలి. విదేశాల్లో తెలుగువాళ్లు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. దీనిని సాధించేందుకు అండగా ఉంటాం. సింగల్ విండో కింద రుణాలు, సబ్సిడీ ఇస్తాం. పారిశ్రామిక రంగంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం. పరిశ్రమల్లో ఉత్పత్తుల మార్కెటింగ్ కు కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. పారిశ్రామిక పార్కులలో పరిశ్రమలను తెచ్చే బాధ్యత ఎమ్మెల్యేలదే. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం. పారిశ్రామికవేత్తలను ఎవరూ బెదిరించకుండా చూసుకోవాలి. ఒక్కో పార్కుకు రూ.10-15 కోట్ల మేర నిధులు ఇస్తాం. వీటితో పాటు ఐదు నుంచి పది ఎకరాలలో నానో పార్కులను కూడా ఏర్పాటు చేస్తాం. రైతులు కూడా పారిశ్రామికవేత్తలుగా మారవచ్చు, అదే మా లక్ష్యం’ అని సీఎం అన్నారు.
Also Read: Telangana CM: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి.. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే
‘మహిళలు కూడా పరిశ్రమలు పెట్టి ఆదాయాన్ని ఆర్టించాలి. మహిళలను కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. రాష్ట్ర రాజధాని ఏదంటే ప్రజలు మా అమరావతి అనే చెప్పుకోవాలి. రామయ్య పట్నం పోర్ట్ వద్ద పరిశ్రమలు వస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. దగదర్తిలో విమానాశ్రయ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాం. ఇలా రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనేదే నా ఆలోచన. ఆత్మకూరు నియోజకవర్గామికి సోమశిల నీటిని ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసింది. అందువల్లే నెల్లూరులో పది స్థానాల్లోనూ టీడీపీని గెలిపించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ఆత్మకూరులో పెడతాం. అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలి, పేదల జీవితాల్లో మార్పు రావాలి. పెన్షన్లను కూడా పెంచాం, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను కూడా పెంచిన పార్టీ టీడీపీనే. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనన్ని పింఛన్లను మన రాష్ట్రం ఇస్తోంది’ అని సీఎం చెప్పుకొచ్చారు.
