ఏపీని వర్షాలు వీడనంటున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. అయితే ఈ తుఫాన్ కి ‘మాండూస్’గా నామకరణం చేశారు. ఈ మేరకు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి కారైకాల్కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపించామన్నారు. తుఫాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తారన్నారు. తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా పయనించునున్నట్లు తెలుస్తోంది. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, ఎస్ఆర్ఎస్పీ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Also Read : Afghanistan: ఆఫ్ఘన్లో బహిరంగంగా మరణశిక్ష.. తాలిబాన్ అధికారం చేపట్టాక ఇదే తొలిసారి
రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటు ఉంచామని, ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. జిల్లాల వారికిగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులైనా ఆయా జిల్లాల కంట్రోల్రూలను సంప్రదించాలని ఆయన సూచించారు