వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు(38) డీజే పాటలకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశాడు. ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
READ MORE: Amit Shah: “మేము అణ్వాయుధ బెదిరింపులకు భయపడము”.. పాక్కు అమిత్ షా వార్నింగ్..
ఏడాది కాలంలో హృద్రోగాలతో భారత్లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. డీజే శబ్దాలకు గుండెపోటు వస్తుందా? అంటే అవునంటున్నారు నిపుణులు. డీజే శబ్దాలు ఒక్కసారిగా మొదలై.. షాక్కు గురయ్యే పరిస్థితి ఎదురైతే గుండెపై ప్రభావం పడుతుంది. అది కూడా అప్పటికే గుండె జబ్బులు లేదా ఏదైనా బ్లాక్స్ వంటివి ఉంటే ఒక్కసారిగా మొదలయ్యే డీజే శబ్దంతో ఆ వ్యక్తిపై ప్రభావం పడుతుంది. ఆ సందర్భాల్లో గుండెపోటు రావడం లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం జరగవచ్చు. డీజేల భారీ శబ్దాల వల్ల గుండె దడ మొదలై గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. కానీ, అప్పటికే గుండెలో ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.