UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..

Madhya Pradesh

Madhya Pradesh

UCC Bill: మధ్యప్రదేశ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే యూసీసీ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అయితే, కట్ని జిల్లాలో జరిగిన ఒక పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. “రాష్ట్రంలో ఒక్క పెళ్లి చేసుకున్న వారికి మాత్రమే చట్టబద్ధంగా నివసించే హక్కు ఉంటుంది” అని సీఎం వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి, ఒకే జెండా ఉన్నప్పుడు హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. “రాముడు ఒకే పెళ్లి చేసుకున్నప్పుడు.. రహీమ్‌కు రెండు, మూడు, నాలుగు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలి? ముస్లిం మహిళలు సైతం మన సోదరీమణులే. ప్రతిపాదిత యూసీసీ చట్టం ప్రకారం.. ఒక్క వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్‌లో ఉండే చట్టపరమైన హక్కు ఉంటుంది” అని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత చట్టాల ప్రకారం తక్షణ త్రిబుల్ తలాక్‌కు ఎంతమాత్రం తావులేదని, ఎవరైనా ‘తలాక్, తలాక్, తలాక్’ అంటే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. భోపాల్‌లోని జగదీష్‌పూర్‌లో జరగబోయే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, ఆపై అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందూ-ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించిందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. సీఎం మోహన్ యాదవ్ తన పోలిక కోసం ‘రామ్’, ‘రహీమ్’ వంటి పవిత్రమైన పేర్లను ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్ల పేర్లను వాడుకోవడం ముఖ్యమంత్రి ఆలోచనా ధోరణి దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. “యూసీసీ గురించి మాట్లాడుతూ కేవలం వివాహాల గురించే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. మరి ఇదే విషయాన్ని మన దేశంలోని గిరిజన తెగలకు ఆయన చెప్పగలరా? భారత రాజ్యాంగం కొన్ని గిరిజన వర్గాలకు బహుభార్యత్వాన్ని అనుమతించిందనే విషయం ఆయనకు తెలియదా? వారి హక్కులను కూడా లాగేసుకోవాలని చూస్తున్నారా?” అని హఫీజ్ ప్రశ్నించారు. యూసీసీ పేరుతో బీజేపీ కేవలం ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ నేత ఆరోపించారు.