ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జులై 10 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. లండన్లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదనంలో గురువారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ఆరంభం అవుతుంది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ గెలిచింది. అండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టులో గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించాలని ఇంగ్లండ్, భారత్ టీమ్స్ చూస్తున్నాయి. రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో.. మూడో మ్యాచ్ కోసం ఇంగ్లీష్ టీమ్ బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది.
లండన్ టెస్ట్ మ్యాచ్ కోసం తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు. పేసర్ జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా.. రెండో టెస్టులో ఆడిన మిగతా జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది. ఆర్చర్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో భారత్ ప్లేయర్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆర్చర్ వేసే బంతులు నేరుగా బ్యాటర్ల తల మీదకు దూసుకొస్తాయి. చాల మంది బ్యాటర్లకు ఆర్చర్ బౌలింగ్లో దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
Also Read: PVN Madhav: డిప్యూటీ సీఎం పవన్ను కలిసిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు.. కీలక అంశాలపై చర్చ!
జోఫ్రా ఆర్చర్ చివరగా 2021 ఫిబ్రవరిలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2021లో టీమిండియా పైనే అతడు టెస్టు మ్యాచ్ ఆడాడు. అనంతరం ఫిట్నెస్ సమస్యలు, గాయాలతో టెస్ట్ క్రికెట్కు దూరమయ్యాడు. ఇటీవల కౌంటీ క్రికెట్లో ఫిట్నెస్ నిరూపించుకోవడంతో టెస్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మూడో టెస్టులో నిప్పులు చేరిగేందుకు సిద్దమయ్యాడు. లార్డ్స్ మైదానంలో ఆర్చర్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. 2019లో ఆస్ట్రేలియాపై లార్డ్స్లో ఆడాడు.