కూకట్పల్లిలో కోటి రూపాయల లూటీ సంచలనంగా మారింది. కోటి రూపాయల నగదుతో వెళ్తున్న వ్యక్తులపై.. కారం పొడి చల్లి, కత్తులతో బెదిరించి.. నగదు దోచుకెళ్లారు దుండగులు. దోపిడి జరిగిన 7 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. కోటి రూపాయల డబ్బును సిల్లీగా కాటన్ డబ్బాలో ప్యాక్ చేసి.. బైక్పై ఎందుకు తీసుకెళ్తున్నారు..?? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఇచ్చిందెవరు.. ఇవ్వాల్సింది ఎవరికి..? అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి మెయిన్ రోడ్డులో కోటి రూపాయల దోపిడి జరిగింది. బైక్పై కోటి రూపాయలతో వెళ్తున్న వ్యక్తులపై.. రెండు బైకుల్లో వచ్చిన మరో గ్యాంగ్ ఎటాక్ చేసింది. కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. కోటి రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటన అంతా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుటే జరిగింది.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన డబ్బు.. హవాలా నెట్వర్క్కి చెందిన డబ్బుగా గుర్తించారు పోలీసులు. డబ్బులు తరలిస్తున్న అజీముద్దీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో హవాలా నెట్వర్క్ బండారం బయటపడింది. బహదూర్పురకి చెందిన ఏసీ మెకానిక్ అజీముద్దీన్, ఖుష్రూ.. అమీర్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారు. మార్చి 16న రాత్రి 7 గంటలకు అమీర్.. అజీముద్దీన్కి ఓ 10 రూపాయల నోటు ఇచ్చాడు. ఈ నోటును కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ 825 వద్ద ఉన్న గోకుల్ అపార్ట్మెంట్లో పవన్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. కూకట్పల్లి చేరుకున్న అజీముద్దీన్.. పవన్కి కాల్ చేశాడు. అపార్ట్మెంట్లో 206 ఫ్లాట్కి రావాలని పవన్ సూచించడంతో అక్కడికి వెళ్లారు అజీముద్దీన్, ఖుష్రూ. తమ వద్ద ఉన్న 10 రూపాయల నోటు ఇవ్వగానే చెక్ చేసుకుని.. కోటి రూపాయల డబ్బు ఉన్న కాటన్ డబ్బాను అజీముద్దీన్కు ఇచ్చాడు పవన్…
కోటి రూపాయల డబ్బు ఉన్న బాక్స్ తీసుకున్న అజీముద్దీన్… అమీర్కి కాల్ చేశాడు. అతను ఇబ్రహీం అనే మరో వ్యక్తికి కాల్ చేయమని చెప్పాడు. అజీముద్దీన్.. ఇబ్రహీంకి కాల్ చేయగా… పిల్లర్ నెంబర్ 848 దగ్గరకు రమ్మని చెప్పాడు. ఖుష్రూ బైక్ నడుపుతుండగా.. అజీముద్దీన్ డబ్బు ఉన్న బాక్స్ పట్టుకుని వెనక కూర్చున్నాడు. పిల్లర్ నెం. 836 దగ్గరకు రాగానే రెండు బైకుల్లో వచ్చిన వ్యక్తులు అజీముద్దీన్పై కారం పొడి చల్లారు. బైక్పై ఉన్న ఇద్దరూ కిందపడిపోగానే… కత్తులతో బెదిరించి డబ్బు దోచుకెళ్లారు…
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అజీముద్దీన్, ఖుష్రూలకు వైద్యం చేయించి.. పోలీస్ స్టేషన్కి తరలించారు. వీళ్ల నుంచి వివరాలు సేకరించారు. దోపిడీ జరిగిన ప్రదేశంలో.. డబ్బులు కలెక్ట్ చేసుకున్న ఫ్లాట్ వద్ద నుంచి CC ఫుటేజ్ సేకరించారు. దుండగుల కోసం 4 ప్రత్యేక టీమ్స్తో గాలించారు. తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లక్నోకి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా.. ముగ్గురు దుండగులను పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
హవాలా రూపంలో డబ్బులు ఇచ్చిన పవన్ ఎవరు..? ఎంత కాలంగా ఈ దందా నడిపిస్తున్నారు. పవన్ వెనక ఉన్న వ్యక్తులు ఎవరు..? పవన్ ఎవరికి డబ్బులు చేరవేస్తున్నాడు..? అనే వివరాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే.. అపార్ట్మెంట్లో C tech Finserv సొల్యూషన్స్ పేరుతో పవన్ నిర్వహిస్తున్న సంస్థ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులకు.. హవాలా రూపంలో డబ్బులు తరలిస్తున్న వ్యక్తులకు మధ్య ఉన్న లింకులపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు…