ఇరాన్తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
‘‘మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా మేము చేస్తున్న సైనిక చర్యలో పాలుపంచుకోవడానికి నాటో మిత్రదేశాలు చాలా వరకు ఇష్టపడటం లేదు. వాస్తవానికి మేము చేస్తున్న దానికి దాదాపు ప్రతి దేశం గట్టిగా మద్దతు తెలిపినప్పటికీ.. ఇరాన్ను ఏ విధంగానూ, ఏ రూపంలోనూ అణ్వాయుధం కలిగి ఉండటానికి అనుమతించకూడదని చెప్పినప్పటికీ ఇది జరిగింది. అయితే వారి చర్య నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే నేను నాటోను ఎప్పుడూ ఒక ఏకపక్ష వ్యవహారంగానే భావించాను. ఈ దేశాలను రక్షించడానికి మనం ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంటాము. మనం వారిని రక్షిస్తాము. కానీ వారు మన కోసం ఏమీ చేయరు. ముఖ్యంగా అవసరమైన సమయంలో’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
‘‘అదృష్టవశాత్తూ ఇరాన్ సైన్యాన్ని అమెరికా నాశనం చేసింది. వారి నౌకాదళం పోయింది. వారి వైమానిక దళం పోయింది. వారి విమాన నిరోధక, రాడార్ పోయింది. బహుశా అన్నింటికన్నా ముఖ్యంగా దాదాపు ప్రతి స్థాయిలో ఉన్న నాయకులు హతమయ్యారు. ఇకపై మనకు, మన మధ్యప్రాచ్య మిత్రదేశాలకు, లేదా ప్రపంచానికి ఎప్పటికీ ముప్పు కలిగించలేరు! మనకు ఇంతటి సైనిక బలం ఉన్నందున… విజయం. మాకు ఇకపై నాటో దేశాల సహాయం అవసరం లేదు. నాటోను కూడా కోరుకోవడం లేదు. మేము దానిని ఎన్నడూ కోరుకోలేదు! అదే విధంగా.. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా విషయంలో కూడా. నిజానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా చెబుతున్నాను. మాకు ఎవరి సహాయం అవసరం లేదు!.’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
కీర్ స్టార్మర్..
ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పటికీ.. ‘‘దృష్టి ఉక్రెయిన్పైనే కేంద్రీకృతమై ఉండాలి.’’ అని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మంగళవారం లండన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అన్నారు. ‘‘ఇరాన్తో స్పష్టంగా సంఘర్షణ జరుగుతోంది. కానీ ఉక్రెయిన్లో ఏమి జరుగుతుందో తెలిసిందే. మన మద్దతు అవసరాన్ని మనం విస్మరించకూడదు.’’ అని స్టార్మర్ అన్నారు.