Kuppam Murder Case: కుప్పం నియోజకవర్గంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఆ హత్యకు కారణం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాలే కావడం పలు అనుమానాలకు దారి తీసింది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఆ ఫోన్ కాల్ వల్లే ఆ యువకుడు బయటకు వెళ్లడం… చివరికి తెల్లవారేసరికి శవంగా మామిడి పొలాల్లో కనిపించడం వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు కుప్పం పోలీసులు. ఐతే సొంత బంధువులే ఈ హత్యకు కారణంగా భావించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవి కూతురుగా ఆ హీరోయిన్?
19 ఏళ్ల నవాజ్ అనే యువకుడు కుప్పంలోని శాంతిపురంలో మోటార్ వెల్డింగ్ షాపులో పని చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ అతని జీవితంలోకి వచ్చిన ఒక ప్రేమ కథ.. చివరికి అతని ప్రాణాలను బలితీసుకుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 14 రాత్రి సుమారు 11 గంటల సమయం. నవాజ్ ఫోన్ మోగింది. ఆ కాల్ ఎవరిదో తెలియదు.. కానీ ఆ కాల్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదే అతని చివరి ప్రయాణం అవుతుందని ఎవరికీ తెలియదు. రాత్రంతా ఇంటికి రాని నవాజ్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా.. మరునాడు ఉదయం ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఎంకేపురం – శాంతిపురం రహదారి పక్కన ఉన్న మామిడి తోటలో యువకుడి మృతదేహం కనిపించిందని అది నవాజ్దేనని గుర్తించి స్థానికులు పోలిసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన స్పాట్కు బయల్దేరి వెళ్లిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నవాజ్ తల, శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణ మేరకు హత్య కేసుగా నమోదు చేశారు. అయితే ఈ కేసులో అసలు మలుపు మాత్రం ప్రేమ కోణమేనని తెలుస్తోంది. నవాజ్కు ఒక స్థానిక యువతితో ప్రేమ సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసి, కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నట్లు తెలుస్తోంది.
మార్చి 14న రాత్రి కూడా నవాజ్, యువతి సంబంధీకుల మధ్య ఘర్షణ జరిగిందనే ప్రచారం ఉంది. అదే కోపం.. కక్షగా మారి.. పక్కా ప్లాన్తో నవాజ్ను పిలిపించి హత్య చేసి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, పోలీస్ జాగిలాల ఆధారంగా ఆధారాలు సేకరించాయి. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమ.. కక్షగా మారితే ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. నవాజ్ హత్య వెనుక అసలు నిజం ఏమిటి? ఆ ఫోన్ కాల్ చేసినది ఎవరు? హత్యకు దారితీసిన నిజమైన కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
READ ALSO: Congress: కేరళ ఎన్నికల నగారా.. 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!