KTR: రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని తాను లేఖ రాశానని తెలిపారు. సీఎంకు డబ్బు సంచులపై ఉన్న దృష్టి ధాన్యం సంచులపై కూడా ఉంటుందని భావించానని, కానీ ఇటీవల సీఎం నిర్వహించిన ప్రెస్మీట్ చూస్తే పరిస్థితి అర్థమైందని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 45 డిగ్రీల ఎండల్లో రైతులు 45 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, ఒకే రోజు నలుగురు రైతులు మరణించిన ఘటనలపై తమ పార్టీ నేతలు స్పందించారని అన్నారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదని, కానీ గన్స్ మాత్రం దొరుకుతున్నాయని విమర్శించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని కేటీఆర్ ఆరోపించారు. “స్థలం మీరు నిర్ణయించండి.. మేము వస్తాం. కొనుగోళ్లు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం” అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు 45 శాతం కూడా దాటలేదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ అంశాలపై స్పందిస్తూ, బీజేపీ–కాంగ్రెస్ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వల్ల రైతులకు ఎలాంటి లాభం జరగలేదని అన్నారు.
