జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన విషయం తెలిసిందే. లోన్ చెల్లించలేదని రైతు ఇంటి గేటును ట్రాక్టర్ తీసుకొచ్చి మరి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం కట్టలేదని ఇంత దారుణమా? అని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా? అని బ్యాంకు అధికారులను కేటీఆర్ నిలదీశారు.
Also Read: Ponnam Prabhakar: ఇది రీసర్వే కాదు.. ఇది మిస్ అయిన వారి కోసం మాత్రమే!
‘రుణం కట్టలేదని.. ఇంత దారుణమా?. నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి, రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి, కరెంట్ మోటర్లు అండ్ స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా?. మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా?. రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని.. రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిపై చూపించగలరా?. పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?. గుర్తుపెట్టుకోండి.. రైతులు అంతా గమనిస్తున్నారు. ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు. జై తెలంగాణ’ అని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు.