KTR: బలహీన వర్గాల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలు పెట్టారన్నారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న కేటీఆర్.. పూలే బాటలో కేసీఆర్ నడిచారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కేసీఆర్ బీసీలకు ఇచ్చారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు స్థానాలు బీసీలకు ఇచ్చారన్నారు. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు.
Read ALso: Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా దేనికైనా సిద్ధం.. కోమటిరెడ్డి సవాల్
బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందన్న ఆయన.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పిలిచి బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బీసీలకు లక్ష కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే మూడు ఏళ్లలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పీకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారన్నారు. అవకాశాల కల్పన మన చేతుల్లోనే ఉంటుందని.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ ప్రజలకు, ముస్లిం సోదరులకు కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
