Site icon NTV Telugu

Komatireddy: మేడిగడ్డ ప్రపంచంలో వింత అన్నాడు.. నిజమే 3 నెలలకు కూలింది వింతే..!

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మోసగాడు పదేళ్లు తెలంగాణ పరిపాలించాడని తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే.. జిన్నా ఆగస్టు 14న వేడుకలు చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా అట్లనే జూన్ 1 నుండి వేడుకలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్‌కు పదవి పోయిందని, బిడ్డ జైల్లో ఉందని, కొడుకు పదవి పోయిందని దుఃఖంలో ఉన్నారన్నారు. గొర్రెలు పంపకం, చేపల మీద వేల కోట్లు తిన్నారని.. మీ దగ్గర పని చేసిన అధికారులు జైలుకి పోయారని ఆయన ఆరోపించారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ని ఎలా భరించారు అనే బాధ ఉందన్నారు. మెట్రో ఆరేళ్ళ ఆలస్యం అవ్వడానికి కేసీఆర్ కారణం కాదా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: KTR : మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన అని అబద్ధం చెప్తున్నాడని విమర్శించారు. తెలంగాణ దేవత సోనియాగాంధీ అని.. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీ కాళ్ళు మొక్కి.. అనంతరం గద్దె నెక్కి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఎన్ని మాటలు అన్నాడని మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు తెలుసన్నారు. జూన్‌ 4 తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ ఉండదన్నారు. కుటుంబ సభ్యులు జైల్లో ఉంటారని ఆయన అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కి వెయ్యి కోట్లు ఇస్తే ఐపోయేదని.. కానీ వెయ్యి కోట్లు ఇవ్వకుండా మోసం చేశాడన్నారు. మేడిగడ్డ ప్రపంచంలో కేసీఆర్‌ వింత అన్నాడని.. నిజమే మూడు నెలలకు కూలింది వింతేనంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రిపేర్లు చేసినా ఉండడటం అనుమానమే అని ఎన్డీఎస్‌ నివేదిక ఇచ్చిందన్నారు. తెలివి ఉన్నోడు 11 శాతం ఇంట్రెస్ట్‌తో అప్పులు తెస్తాడా అంటూ ప్రశ్నించారు. నల్గొండ, మహబూబ్ నగర్‌ను ఎండబెట్టారని.. గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్‌కు వచ్చిందా అని అడిగారు. లిక్కర్ స్కామ్‌లు, టానిక్ కంపెనీలు పెట్టుకోవడమే కేసీఆర్ చేసిందంటూ తీవ్రంగా విమర్శించారు.

Read Also: KCR: సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచాం..

కేసీఆర్‌ కరెంట్ గురించి మాట్లాడుతున్నారని.. ఛత్తీస్‌ఘడ్‌లో ఎక్కువ ధరకు కరెంట్ కొన్నారన్నారు. ప్రభాకర్ రావు ఎప్పుడు చూసినా ఆసుపత్రిలో ఉన్నా అనేవాడని ఆయన అన్నారు. ఆయన కరెంట్‌పై ఏం సమీక్ష చేశారని.. నెల రోజుల్లో కరెంట్ దోపిడీ అంతా బయటకు వస్తుందన్నారు. విచారణ నివేదిక బయటకు వస్తుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీకి వచ్చే ముఖం కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్‌ ఎన్ని కేబినెట్‌ మీటింగ్‌ పెట్టారంటూ ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్ చేయించారంటూ కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కొడుకు ఇద్దరు జైలుకు పోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు.

 

Exit mobile version