Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!

Nani

Nani

Kodali Nani: మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నేత కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్ చర్యలపై హైకోర్టు స్టే విధించింది. అలాగే, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది.

ఈ కేసు 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నమోదైంది. 2021 ఫిబ్రవరిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2021 ఫిబ్రవరి 16న ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రాసిక్యూషన్ అనుమతిపై స్టే విధించడంతో పాటు, ప్రస్తుతం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో కొడాలి నానికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణలో మరిన్ని పరిణామాలు వెలుగులోకి రానున్నాయి.