Union Minister Kishan Reddy: దానం నాగేందర్పై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సరైన చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు బరితెగించి తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ విరుద్ధమైన ఫిరాయింపులను వాడుకోవడం మానుకోవాలని సూచించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో రాజశేఖర్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, ఆ తర్వాత కేసీఆర్ కూడా అదే పని చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఈ తీర్పు రాగానే సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా, అసెంబ్లీ స్పీకర్ ఆయనపై అనర్హత పిటిషన్ను ఎందుకు నాన్చారో, ఎందుకు కొట్టివేశారో అర్థం కావడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏ రోజు నామినేషన్ వేశారో ఆ రోజు నుంచే ఆయన శాసన సభ్యత్వం రద్దు అయినట్లు కోర్టు ఇచ్చిన తీర్పు చాలా సమంజసమైనదని, తెలంగాణ ప్రజలంతా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా కుటుంబ పార్టీలేనని, తెలంగాణ సంపదను దోచుకుంటూ అవినీతికి పాల్పడుతూ ప్రజల తీర్పును కాలరాశాయని ఆరోపించారు. “నువ్వు షర్ట్ విప్పితే… నేను ప్యాంట్ విప్పుతా, నువ్వు ఒక కన్ను పీకితే.. నేను రెండు కన్నులు పీకుతా, నువ్వు తొండలు వదిలితే.. నేను బల్లులు వదులుతా” అనే చందంగా అసెంబ్లీ ముందు ఇరు పార్టీల నాయకులు ఒకరు బట్టలు విప్పుతూ, ఇంకొకరు బట్టలు విప్పిస్తూ తీరు మారకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ తర్వాత తెలంగాణ నాశనమైనా పర్వాలేదనే ఆలోచనతో కేసీఆర్, రేవంత్ రెడ్డిలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గతంలో వ్యాపార పర్మిషన్ల కోసం కేటీఆర్ అనుమతి కావాల్సి వస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుమతి కావాల్సి వస్తోందని, అప్పుడు ఆయన దుకాణాలు ఓపెన్ చేసుకుంటే, ఇప్పుడు ఈయన కొత్త దుకాణం తెరిచారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీజేపీ సంపూర్ణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోనిదే అయినప్పటికీ, అక్కడ పోటీ చేసే అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు.

