NTV Telugu Site icon

Kishan Reddy : కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తాం

Kishanreddy

Kishanreddy

బీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ శనివారం బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రేమ్ సింగ్ రాథోడ్ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ గోషామహల్ టికెట్ ఆశించిన భంగపడ్డ ప్రేమ్ సింగ్.. కాసేపటికి క్రితమే బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. అయితే.. నాగార్జునసాగర్ కు చెందిన పలువురు నేతలు సైతం బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సీట్ల కోసం చేరుతుంటారు.. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన అన్నారు. కానీ బీజేపీలో ప్రేమ్ సింగ్ రాథోడ్ ఏం ఆశించకుండా చేరుతున్నారన్నారు. తిరిగి ఆయన తన ఇంటికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ఈనెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు కిషన్‌ రెడ్డి.

అంతేకాకుండా.. ‘111 మంది అభ్యర్థులు బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. దీపావళి తర్వాత విస్తృత ప్రచారం చేస్తాం. అమిత్ షా, యోగి, రాజ్ నాథ్ సింగ్, హిమాంత బిశ్వ శర్మ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం షిండే, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీపై అబద్ధపు ప్రచారం చేస్తోంది. మజ్లీస్, బీజేపీ ఒక్కటేనని అబద్ధాలు చెబుతున్నారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లీస్ తో కలవబోము. వాళ్ళతో లాభపడింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే. మత కలహాలు చేసే పార్టీతో మేము కలిసేది లేదు. కేసీఆర్ ఒక భుజంపై అక్బరుద్దీన్, మరో భజంపై అసద్ ను పెట్టుకుని తిరుగుతున్నారు. కర్ణాటక ప్రజల నెత్తిన భస్మాసుర అస్త్రం పెట్టింది కాంగ్రెస్. ఐదేళ్ళలో చేయాల్సిన నష్టం 5 నెలల్లోనే జరిగిపోయింది. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు అధికారం లేదు.. అవురావురుమంటున్నారు. వాళ్ళు అధికారంలోకి వస్తే అరాచకమే. సీఎం కేసీఆర్ రెండుచోట్ల, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయం. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తాం. అవినీతి, కుట్ర, మోసపూరిత పార్టీల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. తెలంగాణలో కుటుంబ, అవినీతి, నియంతృత్వ చీకటి అలుముకుంది. డిసెంబర్ 3తో రాష్ట్రంలో కమ్ముకున్న ‘కారు'(బీఆర్ఎస్) చీకటిని, అధికారంలోకి వస్తామనుకుంటున్న ‘మసక'(కాంగ్రెస్) చీకటిని పారద్రోలాలి’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.