NTV Telugu Site icon

Kerala Blast: ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేరళ వరుస పేలుళ్ల బాధ్యుడు అరెస్ట్

Kerala Blast

Kerala Blast

Kerala Blast: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పలు వరుస పేలుళ్లకు బాధ్యుడని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు. కన్వెన్షన్ సెంటర్‌లో బాంబులు పెట్టినట్లు మార్టిన్ ప్రకటించి త్రిసూర్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

క్రిస్టియన్ శాఖలో వరుస పేలుళ్లను ఎందుకు అమలు చేశాడో వివరిస్తూ లొంగిపోయే ముందు మార్టిన్ ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను విడుదల చేశాడు. యొహోవా విట్‌నెసెస్ బోధనలను ‘విద్రోహపూరితమైనవి’ ఉన్నాయని అతను ఆరోపించాడు. కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మార్టిన్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. గత 16 ఏళ్లుగా తాను యొహోవా విట్‌నెసెస్ సమూహంలో సభ్యుడిగా ఉన్నానని, తాను యొహోవా విట్‌నెసెస్ బోధనలతో ఏకీభవించడం లేదని, వారి కార్యకలాపాలను నిలిపివేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వారి ఆలోచనలు దేశానికి ప్రమాదకరమని, అవి యువకులను విషపూరితం చేస్తున్నాయని ఆయన అన్నారు.

Also Read: Electoral Bonds Scheme: ఆ హక్కు ప్రజలకు లేదు.. రాజకీయ పార్టీల విరాళాలపై సుప్రీంకు కేంద్రం

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన 6 నిమిషాల వీడియోలో తానే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నానని, అక్కడ పేలుళ్లు జరిపింది తానే అని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం ఆ సంస్థ తప్పుడు మార్గంలో వెళ్తుందని, వారి బోధనలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని నేను గ్రహించానని, వాటిని మార్చుకోవాలని పలుమార్లు కోరానని, అయినప్పటికీ వారు అందుకు సిద్దపడలేదని వీడియోలో తెలిపారు.

దేశంలో నివసిస్తున్న ఇక్కడి ప్రజలను వారు వ్యభిచారులు అని పిలిచే వారని, వారు ఇతరులతో భోజనం చేయవద్దని, వారితో ఉండొద్దని కోరుతారని, వారి భావజాలం తప్పని గ్రహించానని మార్టిన్ వెల్లడించారు. ఓటు వేయద్దని, సైన్యంలో చేరవద్దని చెప్పేవారిని ఆరోపించారు. ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను వ్యాప్తి చేసే ఈ రకమైన సంస్థను నియంత్రించకపోతే, నాలాంటి వారి జీవితాలను త్యాగం చేయాల్సి ఉంటుందని అన్నారు. వారు ఎవరికీ సాయం చేయరు, ఎవరిని గౌరవించరు, దేశానికి వారు ప్రమాదకరంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

మూడు పేలుళ్లు..
కేరళలోని కలమస్సేరిలో ‘యొహోవా విట్‌నెసెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.