Search operation begin in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో రెండు సైనిక వాహనాలపై గురువారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ముందే ప్లాన్ చేసి.. కొండలపై నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దాడికి ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
పూంఛ్ జిల్లాలోని ధేరాకి గాలి, బుఫ్లియాజ్ మధ్య గల ధత్యార్ మోర్ వద్ద గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ మార్గంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉండగా.. దాడి కోసం ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ముందే కొండలపై నక్కి ఉన్న ఉగ్రవాదులు.. ఆ మలుపు వద్ద సైనిక వాహనాలు స్లో కాగానే కొండలపై నుంచి కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. ముష్కరులు పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు చనిపోయారు. దాడికి ముందు ఉగ్రవాదులు ఆ మూలమలుపు చుట్టుపక్కల రెక్కీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Also Read: Lava Storm 5G Price: మార్కెట్లోకి లావా స్టార్మ్ 5జీ.. సూపర్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్!
ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత నెల రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఇద్దరు కెప్టెన్లు, ముగ్గురు జవాన్లు మరణించారు.