నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ లీడర్ కాదు రీడర్ కదంటూ జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెండు సార్లూ ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్ధాంతరంగా వదిలి పెట్టారని, రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పని అని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారని, బీజేపీకి బీఆర్ఎస్ రిష్తెదార్ కాదన్నారు జగదీష్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘రాహులే మోడీకి గుత్తేదారు. నాలుగువేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత. ఫించన్ ప్ల కార్డులు రాహులు తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా. నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీని కోనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్దులకు ఇచ్చేది 350 రూపాయలే. అదే రాష్ట్రంలో వికలాంగులకు 500,వితతంతువులకు ఇచ్చేది 350. అదే పార్టీ ఎలుబడిలో ఉన్న రాజస్థాన్ లోనూ వృద్దులకు ఇచ్చేది 750,వికలాంగులకు 750,వితంతువులకు 550 మాత్రమే. సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటక లోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువ లేదు. కర్ణాటకలో వృద్దులకు 800,విజలాంగులకు 800,వితంతువులకు 800 రూపాయలే. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన కర్ణాటకలో,కోన ఊపిరితో ఉన్న చత్తీస్ ఘడ్ లో,పార్టీని నిలబెట్టిన రాజస్థాన్ లో 4,000 ఫించన్ ఎందుకు ఇవ్వడం లేదు.
అందుకే ఆయనను లీడర్ గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుంది. గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారు. అది కుడా ఆయన ఏ హోదాలో ప్రకటించారు అన్నదే హాస్యాస్పదంగా మారింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణా లో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుఉండాలి. 4,000 ఫించన్ ప్రకటనను ఇక్కడి ప్రజలకు నమ్మ శక్యంగా లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్వాంగులకు 4,000,వితంతువులకు 2016,వృద్దులకు 2,016 ఇస్తున్నారు. కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో.. కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసింది. కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుంది.’ అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.