NTV Telugu Site icon

Ishan Kishan: రంజీల్లో ఆడకపోతే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇషాన్‌ కిషన్‌ కష్టమే!

Ishan Kishan Test

Ishan Kishan Test

టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్‌ కిషన్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న ఇషాన్‌.. అఫ్గానిస్థాన్‌తో జరుగుగుతున్న సిరీస్‌కు ఎంపిక కాలేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడాలని భావించినా.. బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టారని తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే అతడిపై చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ… అలాంటిది ఏమీ లేదని, దేశవాళీ క్రికెట్‌ ఆడి రావాలని అతడికి సూచించామని చెప్పాడు.

రంజీల్లో ఆడేందుకూ ఇషాన్‌ కిషన్ ఆసక్తిగా లేనట్లు సమాచారం తెలుస్తోంది. ఇషాన్ రంజీల్లో ఆడుతున్నట్లు ఝార్ఖండ్‌ క్రికెట్ సంఘం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇషాన్‌ కిషన్ విషయంలో తమకు ఎలాంటి స్పష్టత లేదని, అతడు రంజీ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని చెప్పలేదని ఝార్ఖండ్‌ క్రికెట్ సంఘం కార్యదర్శి దేబశిశ్ చక్రవర్తి చెప్పారు. ఒకవేళ రంజీల్లో ఆడకపోతే ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి ఆరంభం అయ్యే టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయడం కష్టమేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వికెట్‌ కీపర్‌గా కేఎస్ భరత్‌ రేసులో ఉన్న విషయం తెలిసిందే.

Also Read: David Warner in Helicopter: హాలీవుడ్ తరహా ఎంట్రీ.. మ్యాచ్ కోసం హెలికాప్టర్‌లో మైదానంలో దిగిన వార్నర్‌!

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో భారత్ టీ20 సిరీస్‌ ఆడనుంది. అనంతరం భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం అవుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ఫ్రిబ్రవరి 2న రెండో టెస్ట్, ఫ్రిబ్రవరి 15న మూడో టెస్ట్, ఫ్రిబ్రవరి 23న నాలుగో టెస్ట్, మార్చి 7న ఐదవ టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ త్వరలో జట్టును ప్రకటించనుంది.