Site icon NTV Telugu

Iran: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగం..

Iran (1)

Iran (1)

Iran: యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఓ వైపు జెనీవాలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన అణు చర్చలు దాదాపు మూడు గంటలకే ముగిసిన తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిలో క్షిపణుల్ని ప్రయోగించింది. మంగళవారం సైనిక కసరత్తుల కోసం వ్యూహాత్మక జలసంధిని పాక్షికంగా మూసేసింది. జెనీవాలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే విషయాలు బయటకు రాలేదు.

Read Also: Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..

జెనీవాలో చర్చలు ముగిసిన కొద్దిసేపటికే.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తమ అణు హక్కులపై మాట్లాడారు. అణుశక్తి, యురేనియం ఎన్‌రిచ్మెంట్ తమ జాతీయ హక్కు అని, యూఎస్ జోక్యానికి లోబడి ఉండవని అన్నారు. ఇరాన్ శాంతియుత అణు పరిశ్రమ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఇంధన సరఫరా వంటి పౌర అవసరాలకు ఉద్దేశించబడిందని అన్నారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. న్యాయమైన ఒప్పందం కోసం నిజమైన ప్రతిపాదనతో వచ్చామని, బెదిరింపులకు లొంగమని చెప్పారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ లోపల నుంచి తీరం వెంబడి క్షిపణుల్ని ప్రయోగించింది. ఇవి హార్ముజ్ జలసంధిలోని లక్ష్యాలను ఢీకొట్టాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు ఈ జలసంధి కీలకం. అమెరికా దాడులు చేస్తే, ఈ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం చమురు సరఫరా దీని గుండానే జరుగుతుంది.

Exit mobile version