Iran US Israel War: మధ్యప్రాచ్యంలో ప్రత్యక్ష యుద్ధంతో పాటు మాటల వార్ నడుస్తోంది. ఇటీవల ఇరాన్ తీరు మార్చుకోకపోతే విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితి వేగంగా ఉద్రిక్తంగా మారవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఖతమ్ అల్-అన్బియా (ఇరాన్ సైనిక కేంద్ర ప్రధాన కార్యాలయం) ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, మధ్యప్రాచ్యం మొత్తం అమెరికా, ఇజ్రాయెల్లకు నరకంగా మారుతుందన్నారు. ఇరాన్ను ఓడించాలనుకోవడం వారిని కోలుకోలేని ఊబిలోకి నెట్టడమేనని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన పలు సంస్థలను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రతరం చేస్తామని డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ఇబ్రహీం జొల్ఫఘారి ఈ ప్రకటన చేయడం ఉద్రిక్తతలను పెంచించింది.
READ MORE: Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఇదిలా ఉండగా.. ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి నెల రోజులు గడిచి పోయింది. ఇప్పటి వరకు హోర్ముజ్ జలసంధి ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రంపచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిని చుట్టుముట్టే ఈ వివాదం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలని లేదా హోర్ముజ్ మార్గాన్ని తెరవాలని, లేనిపక్షంలో ఆ దేశ ఇంధన వనరులపై దాడులు తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించిన ట్రంప్, ఇరాన్కు ఇచ్చిన గడువు ముగిసిపోతోందని, కేవలం 48 గంటల్లోనే యుద్ధం భీకర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ తన వైఖరిని మారుస్తూ వస్తున్నారు. ఒకవైపు దౌత్యపరమైన చర్చల గురించి మాట్లాడుతూనే, మరోవైపు ఇరాన్ను ‘శిలాయుగం’ (Stone Age) నాటి పరిస్థితికి తీసుకెళ్తామంటూ కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.