Iran: మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) మరోసారి యుద్ధ జ్వాలల్లోకి రగులుతోంది. తమ దేశ భూభాగంపై అమెరికా శనివారం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం తెల్లవారుజామున రంగంలోకి దిగింది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నౌకాదళం, ఏరోస్పేస్ బలగాలు సంయుక్తంగా భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. సిరిక్ (Sirik) ప్రాంతంపై అమెరికా జరిపిన దాడుల వల్ల హర్మూజ్ జలసంధిపై తమకున్న పట్టు ఏమాత్రం తగ్గదని, నిబంధనలను ఉల్లంఘించే వారికి తగిన బుద్ధి చెప్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు నరకాన్ని చవిచూస్తాయంటూ అత్యంత భయానక హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్ శనివారం రాత్రి కువైట్, బహ్రెయిన్లపై క్షిపణి వర్షం కురిపించగా.. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు కువైట్ సైన్యం ధృవీకరించింది. అయితే, ఈ దాడుల వల్ల అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం లేదా ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను యూఎస్ అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. హర్మూజ్ జలసంధిలో ఒక వాణిజ్య నౌకపై దాడి జరిగిందనే సాకుతో అమెరికా తమ తీరప్రాంతంలోని ఐదు వ్యూహాత్మక స్థావరాలపై దాడులు చేసిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ఇటీవలే కుదిరిన ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందాన్ని’ (Islamabad MOU) అమెరికానే ఉల్లంఘించిందని, ఈ చర్యలతో ప్రస్తుత దౌత్యపరమైన చర్చలన్నీ పూర్తిగా నిలిచిపోతాయని ఇరాన్ హెచ్చరించింది. తమపై జరిగే ఎలాంటి శత్రు దేశ దురాక్రమణకైనా మునుపటి కంటే అత్యంత ఘోరమైన సమాధానం ఉంటుందని స్పష్టం చేసింది.
అంతకుముందు, రెండు మిలియన్లకు పైగా ముడి చమురు బారెళ్లతో వెళ్తున్న ‘ఎమ్/టి కికు’ (M/T Kiku) అనే పనామా చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్పై వరుసగా రెండో రోజు క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల వల్ల హర్మూజ్ జలసంధి సమీపంలోని సిరిక్ ద్వీపంలో భారీ పేలుళ్లు సంభవించగా, కేష్మ్ (Qeshm) ద్వీపంలోని ఒక గ్రామంపై కూడా అమెరికా రాకెట్లు పడినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ దాడుల అనంతరం ట్రంప్ Truth Socialలో స్పందిస్తూ, “ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించింది. వారు ఎప్పటికీ బుద్ధి తెచ్చుకోకపోవచ్చు. ఒకవేళ మేము సైనికపరంగా ప్రారంభించిన పనిని పూర్తిగా ముగించాల్సి వస్తే, ఇకపై ఇరాన్ అనే దేశమే ప్రపంచ పటంలో ఉండదు” అని అత్యంత తీవ్రంగా హెచ్చరించారు. ఈ పరిస్థితులు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.

