Iran vs Israel War: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు నెల రోజులు పూర్తయింది. సరిగ్గా ఈ ఏడాదిలోని ఫిబ్రవరి 28న ఘర్షణ మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్లోని సైనిక స్థావరాలు, నగరాలపై ఆకస్మిక వైమానిక దాడులు చేయడం ద్వారా ఈ సంఘర్షణకు బీజం పడింది. ఈ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అధికారులు మరణించారు. ఖమేనీ మరణంతో ఇరాన్ కుప్పకూలుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా ఆ దేశ పాలనా వ్యవస్థ తుడిచి పెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా మారింది. ఈ ఇద్దరి నేతల అంచనాలు తలకిందులయ్యాయి. భారీ బాంబు దాడులను తట్టుకుని నిలబడటమే కాకుండా, తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ఎదురుదాడి చేస్తూ గల్ఫ్ దేశాలను, ప్రపంచ ఇంధన సరఫరాను గడగడలాడిస్తోంది. ఈ యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి జరుగుతున్న కీలక పరిణామాల గురించి చర్చద్దాం..
వాస్తవానికి.. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన మొదటి 24 గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని 1,500 లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తారని, పాలన మారుతుందని ట్రంప్ ఆశించారు. దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఐఆర్జీసీ కమాండర్, రక్షణ మంత్రి మరణించారు. అయితే, ఇరాన్ దేశం మినాబ్లోని ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 175 మంది పాఠశాల విద్యార్థినులు మరణించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది అమెరికా చేసిన “టార్గెటింగ్ ఎర్రర్” అని తేలడంతో అగ్రరాజ్యం ఆత్మరక్షణలో పడింది. ఇరాన్ ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ ధీటుగా బదులు ఇవ్వడం ప్రారంభించింది. దాడి జరిగిన మొదటి 100 గంటల్లోనే గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై 500 క్షిపణులు, 2,000 షాహెద్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో మూడు దేశాల మధ్య సాగిన ఈ యుద్ధం కాస్త 16 దేశాలకు పాకింది.
మరోవైపు.. అమెరికా సైతం తగ్గలేదు. హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళ విన్యాసాల నుంచి తిరిగి వస్తున్న ఇరాన్ యుద్ధనౌకను అమెరికా సబ్మెరైన్ టోర్పెడోతో ముంచివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేసిన ఇటువంటి మొదటి దాడి ఇది. ఇందులో 90 మంది ఇరాన్ సైనికులు మరణించారు. అనంతరం ఈ ఘర్షణలో హిజ్బుల్లా (Hezbollah) ఎంట్రీ ఇవ్వడం మరో హీట్ పెరిగింది. మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరులో 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో ఇరాన్లో ఇప్పటివరకు 1,400 మంది పౌరులతో కలిపి మొత్తం 3,300 మంది మరణించినట్లు అంచనా. ఈ పరిణామాల మధ్య ఇరాన్ బాధ్యతలను ఖమేనీ కుమారుడు చేపట్టారు. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా (56) కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. యుద్ధం ముదురుతున్నా.. మొజ్తబా మాత్రం బహిరంగంగా కనిపించాలేదు. దీంతో కొత్త సుప్రీం లీడర్ కోమాలో ఉన్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మొజ్తబా గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అంటున్నారు. ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ దౌత్యపరమైన బాధ్యతలు చూస్తున్నారు.
READ MORE: Prabhas: ప్రభాస్ ఓ బాక్సాఫీస్ రికార్డ్ బుక్.. టచ్ చేయడం అంతా ఈజీ కాదు!
ఈ దాడులు రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఇరాన్ ఆర్థిక వెన్నుముక అయిన ‘సౌత్ పార్స్’ గ్యాస్ ఫీల్డ్ను దెబ్బతీసింది. సౌత్ పార్స్/నార్త్ డోమ్ (South Pars/North Dome) పెర్షియన్ గల్ఫ్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు క్షేత్రం. ఇది ఇరాన్ (సౌత్ పార్స్) మరియు ఖతార్ (నార్త్ డోమ్) మధ్య విస్తరించి ఉంది. ఈ దాడితో ఇరాన్ ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్, సౌదీ అరేబియాలోని అరామ్కో రిఫైనరీపై ఇరాన్ దాడులు చేసింది. ఈ పరిణామం ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలకు దారితీసింది. చమురు ధరలు 40% పెరగడంతో ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే నెతన్యాహు ఆచూకీ లేదని, ఆయన చనిపోయారనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచ చమురులో 20% సరఫరా అయ్యే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. శత్రువుల నౌకలకు ప్రవేశం నిరాకరిస్తూ, తటస్థ దేశాల నుంచి 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 18 కోట్లు) వరకు ‘టోల్’ వసూలు చేస్తోంది. ఈ యుద్ధ వాతావారణంలో ఇరాన్ భారత్కు మద్దతు ఇచ్చింది. భారత్ను మిత్ర దేశంగ పరిగణించింది. భారత్ తన దౌత్య చాకచక్యంతో ఇరాన్ నుంచి ప్రత్యేక అనుమతి పొందింది. ఇప్పటివరకు 9 భారతీయ ట్యాంకర్లు సురక్షితంగా వచ్చాయి, మరో 22 వేచి చూస్తున్నాయి. అయినప్పటికీ, భారత్లో వంటగ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 6 వరకు దాడులకు ట్రంప్ విరామం ఇచ్చారు. ఇరాన్ మాత్రం యుద్ధం తమ నిబంధనల ప్రకారమే ముగుస్తుందని భీష్మిస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే, ఇరాన్ ప్రధాన చమురు కేంద్రమైన ‘ఖర్గ్ ఐలాండ్’ (Kharg Island) ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా గ్రౌండ్ ఇన్వేషన్ (భూతల దాడి) చేసే అవకాశం ఉంది. వేలాది మంది మెరైన్ సైనికులు ఇప్పటికే మధ్యప్రాచ్యానికి చేరుకున్నారు. ఇక ముందు ఏం జరగనుందో వేచి చూడాలి.