Pollution Report: ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందని IQAir నివేదిక స్పష్టం చేసింది. తాజాగా ఈ సంస్థ 2024-25 సంబంధించిన ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దక్షిణ ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఈ సంక్షోభానికి కేంద్ర బిందువులుగా మారాయి. ఈ ప్రాంతాల్లోని నగరీకరణ, పరిశ్రమల పెరుగుదల, వాతావరణ మార్పులు వాయు కాలుష్యాన్ని మరింత ఉధృతంగా మారుస్తున్నాయని పేర్కొంది.
Read Also: IMF: పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నిధులు విడుదల
ఇక నివేదిక ప్రకారం భారత్లో 2023లో సగటు PM2.5 స్థాయి 54.4 µg/m³గా ఉండగా, తాజా నివేదికలో అది 50.6 µg/m³కి తగ్గింది. దీంతో భారత్ ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాల్లో మూడవ స్థానం నుండి ఈ ఏడాది అయిదవ స్థానానికి దిగజారింది. ఇది స్వల్ప మెరుగుదలకే సంకేతం. అయినా, ఇంకా చాలా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రం అత్యంత కాలుష్యిత దేశాల జాబితాలో వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి. పాకిస్తాన్లో సగటు PM2.5 స్థాయి 73.7 µg/m³కి చేరుకుంది. ఇది అత్యంత తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా పరిగణించబడుతుంది. వాయు కాలుష్యం గుండె సమస్యలు, ఆస్థమా, కేన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు ప్రధాన కారణమని నివేదిక చెబుతోంది.
Read Also: IND-PAK Tension: ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్..
ఇక IQAir నివేదిక ప్రకారం ఐస్లాండ్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ వంటి దేశాలు తక్కువ కాలుష్య స్థాయిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ దేశాలు గ్రీన్ పాలసీలను, పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థంగా అమలు చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. IQAir నివేదిక దక్షిణ ఆసియాలోని దేశాలు తమ వాతావరణ విధానాలను పునఃపరిశీలించి, స్థిరమైన అభివృద్ధి మార్గాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక చర్యలు, కఠిన నిబంధనలు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొంది.