Intermediate Practical Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కాపాడేందుకు ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం ద్వారా మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఇంటర్ బోర్డ్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ (CCR) ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో 5,500 సీసీటీవీ కెమెరాలు, సెక్టార్ కళాశాలల్లో 1,300 కెమెరాలు, ప్రైవేట్ కళాశాలల్లో 7,500 కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని CCRకు అనుసంధానించారు. ఎక్కడైనా అక్రమాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను అమలు చేశారు.
iProjector 3 Plus: థియేటర్కు వెళ్లనవసరం లేదు.. మీ ఇంట్లోనే అదిరిపోయే థియేటర్ ఎక్స్పీరియన్స్!
ఫ్లయింగ్ స్క్వాడ్లు, జిల్లా పరీక్ష కమిటీలతో సమన్వయం చేస్తూ పరీక్షలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో లోపాలు గుర్తించిన కారణంగా 83 మంది పరీక్షాధికారులను విధుల నుంచి తొలగించారు. అలాగే నియమావళి ఉల్లంఘనల కారణంగా 5 పరీక్షా కేంద్రాలను రద్దు చేసి, అక్కడి విద్యార్థులను సమీప కేంద్రాలకు మార్చారు. ఈ ఏడాది సాధారణ కోర్సులకు 1,440 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు, వృత్తిపర కోర్సులకు 484 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు, అలాగే 1,495 థియరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగడంతో పరీక్షలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా జరిగాయని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు.