Intelligence Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల కమిషన్ కు నిఘా వర్గాలు నివేదికను ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా పెట్టాలని పోలీసులకు వెల్లడించింది.
Read Also: TG ECET Results: మరికాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు..
కాగా, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ఈసీ చెప్పుకొచ్చింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరికి నేరచరిత్ర ఉంది?..అనే దానిపై ముందుగానే గుర్తించి వారిపై నజర్ పెట్టనుంది. హింసాత్మక ఘటనల హెచ్చరికలతో ఈ రెండు నియోజకవర్గాల పోలీసులు భద్రతను పెంచారు. కౌంటర్ సమయంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండేలా భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. డౌట్ వచ్చిన వారిని ముందుస్థుగానే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అయితే, కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున ఈసీ మోహరించింది. పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల పొలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల కమిషన్ సీరియస్ ఆదేశాలు జారీ చేసింది.