Minister Seethakka : ఇంద్రవెల్లి సంఘటన జ్ఞాపకార్థం నిర్వహించిన సభలో ఆదివాసుల హక్కుల కోసం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. “అనాటి ఘటన దురదృష్టకరమైనది. అది ఎవరి వైపు నుంచైనా తప్పుగా జరిగి ఉండొచ్చు, కానీ బాధ్యతను మేమే తీసుకుంటాం” అంటూ ఆమె పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, అప్పట్లో రెవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లి అమరవీరుల జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. “అప్పుడు నివాళులర్పించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. నిషేధాలు విధించబడ్డాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇంద్రవెల్లి సంఘటనను ‘సంస్కరణ దినం’గా నిర్వహిస్తోంది,” అని తెలిపారు.
అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యార్హతల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైబల్ వేల్ఫేర్ డిపార్ట్మెంట్ (ITDA) ద్వారా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పంపిణీ చేశామని చెప్పారు. సంఘటనలో మరణించిన వారి పూర్తి వివరాలను సేకరించేందుకు ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, “కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క–సారలమ్మలు పోరాడారు. నిజాం హయాంలో కొమరం భీమ్, అలాగే ఇంద్రవెల్లి వీరులా అందరూ జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలు అర్పించారు,” అని గుర్తు చేశారు. సమ్మక్క–సారక్క జాతరను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. “గత ప్రభుత్వం ఐటిడిఎలను నిర్వీర్యం చేసింది. మేము తిరిగి వాటికి ప్రాణం పోస్తున్నాం. త్వరలో ఐటిడిఎల మీటింగ్ నిర్వహిస్తాం. జీవో నెంబర్ 3పై మేధావులతో చర్చిస్తాం,” అన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల ద్వారా ఆర్థికసాయం చేస్తున్నామని, పీఎం మోడీ కూడా “ఇప్ప పువ్వు లడ్డు”పై ప్రశంసలు తెలిపారన్నారు. సాగుచేసుకుంటున్న భూములకు హక్కుల పత్రాలు ఇవ్వడం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. సర్వే పూర్తైన భూములకు హక్కులు కల్పిస్తామని, కానీ కొత్తగా అడవిని నరికేలా చేయరని చెప్పారు.
ఆగస్ట్ 9న అమరవీరుల స్మృతివనం ప్రారంభం: “ఇంద్రవెల్లి అమరవీర్లకు అంకితంగా నిర్మిస్తున్న స్మృతివనాన్ని ఆగస్ట్ 9న ప్రారంభిస్తాం. ఇందులో ఎవరి ఫోటోలు పెట్టాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటాం,” అని సీతక్క వివరించారు. “ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలి. రైతులు ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుంటూ బోర్లు వేసుకుని రెండు పంటలు దిగాలన్నదే మా ఉద్దేశం,” అన్నారు.
Health Tips: ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి!