India vs Pakistan controversy: టీ 20 వరల్డ్ కప్కు ముందు పాకిస్థాన్ మూర్ఖ వైఖరి గురించి అందరికీ తెలిసిందే. భద్రతా అంశాన్ని తెరపైకి తెచ్చిన పాక్.. భారత్తో మ్యాచ్ ఆడేందుకు నో చెప్పింది. టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్తో జరిగే మ్యాచ్లను పాకిస్థాన్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై తాజాగా భారత క్రికెట్ బోర్డు(BCCI) స్పందించింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ విషయంలో బోర్డు వైఖరి చాలా క్లియర్గా ఉందని స్పష్టం చేశారు. తాజాగా ANIతో మాట్లాడిన ఆయన.. “పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలపై బీసీసీఐకి చెప్పాల్సిందేమీ లేదు. ఈ నిర్ణయం పూర్తిగా ఐసీసీ పరిధిలో ఉంటుంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటే, మేం అదే పాటిస్తాం,” అని తెలిపారు. అంటే ఈ వివాదంలో భారత్ తుది తీర్పును ఐసీసీకే వదిలేసింది.
ఇదిలా ఉండగా.. బుధవారం ఇస్లామాబాద్లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. శ్రీలంకలో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను తమ జట్టు ఆడబోదని మరోసారి ప్రకటించారు. “ఈ విషయంలో మేం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. భారత్తో మ్యాచ్ ఆడబోం. ఈ నిర్ణయం తొందరపాటులో తీసుకున్నది కాదు. బాగా ఆలోచించి, అన్ని కోణాలు చూసిన తర్వాతే ఈ స్టాండ్ తీసుకున్నాం” అని తెలిపారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని చెబుతూనే, భారత్తో మ్యాచ్ను బహిష్కరించడమే సరైన నిర్ణయమని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇది తొలిసారి చేసిన ప్రకటన కాదు. దీనికంటే ముందే పాకిస్థాన్ ప్రభుత్వం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన చేసింది. భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఆడబోదని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సరైన కారణం మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాతే ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఒకవైపు పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా నిలబడుతుంటే, మరోవైపు బీసీసీఐ నిర్ణయాన్ని ఐసీసీ చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఏం జరగనుందో ఐసీసీ నిర్ణయించాలి.