WTC Final: కోల్కాతా టెస్ట్లో టీమిండియా ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భారత్ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారింది. ఇప్పటివరకు శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మూడు టెస్ట్ల్లో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సైకిల్లో మొత్తం నాలుగు విజయాలే సాధించగలిగిన భారత్.. టాప్-2 స్థానాల్లోకి చేరేందుకు భారీ సవాల్ను ఎదుర్కోతోంది. కానీ పోటీ అప్పుడే పూర్తిగా ఐపోలేదు. ప్రస్తుతం భారత్ సుమారు 54% పాయింట్స్ శాతంతో నాల్గవ స్థానంలో ఉంది. సాధారణంగా WTC ఫైనల్కు అర్హత పొందేందుకు అవసరమైన PTC 64% నుంచి 68% మధ్య ఉంటుంది. అందువల్ల మిగిలిన మ్యాచ్ల్లో ఎక్కువ భాగాన్ని భారత్ గెలవాల్సిందే. లేకపోతే ఒక్కో తప్పిదం కూడా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
భారత్కి మిగిలిన WTC మ్యాచ్ లు:
* దక్షిణాఫ్రికాతో హోమ్ సిరీస్ – 1 టెస్ట్.
* శ్రీలంకలో సిరీస్ – 2 టెస్టులు.
* న్యూ జిలాండ్లో సిరీస్ – 2 టెస్టులు.
* ఆస్ట్రేలియాతో హోమ్ సిరీస్ – 5 టెస్టులు
ఈ మొత్తం 10 టెస్టులన్నింటినీ గెలిస్తే భారత్ పాయింట్ల సంఖ్య 172కి చేరుతుంది. ఇప్పటికే భారత జట్టు 18 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు ఆడేసింది. మిగిలిన మ్యాచ్లలో భారత్ సాధించే విజయాలపై ఆధారపడి పీసీటీ మారుతుంది. ఇందులో 5 విజయాలు సాధిస్తే 51.85%, 6 విజయాలు సాధిస్తే 57.41%, 7 విజయాలు సాధిస్తే 62.96%, 8 విజయాలు సాధిస్తే 68.52%, 9 విజయాలు సాధిస్తే 74.07%, 10 విజయాలు సాధిస్తే 79.63% గా చేరుతుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. WTC ఫైనల్కు సురక్షితంగా చేరాలంటే భారత్ కనీసం 8 విజయాలు సాధించాల్సిందే. అప్పుడు మాత్రమే పీసీటీ 68% దాటే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మూడు సైకిల్లు ముగిసాయి, వాటిలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఒక్కొక్కసారి చాంపియన్ అయ్యాయి. గత రికార్డులు చూస్తే.. సాధారణంగా 68% పరిధిలో PTC ఉన్న జట్లు ఫైనల్కు అర్హత పొందుతున్నాయి. ఈ అంచనా ప్రకారం భారత్ మరోసారి WTC ఫైనల్ ఆడాలంటే అసాధారణ ప్రదర్శన తప్పనిసరి. మిగిలిన 10 టెస్టుల్లో కనీసం 8 విజయాలను లక్ష్యంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.