NTV Telugu Site icon

America: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ .. అమెరికా ప్రశంసలు

John Kirby

John Kirby

అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు. “భారతీయులు ఓటు వేయడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రశంసనీయం. భారతదేశంలో 96 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భాగమవుతున్నారు. 2,660 గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. వేలాది మంది పోటీదారుల నుంచి 545 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకోబోతున్నారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

READ MORE: Immigration Visas : అమెరికా వీసా కోసం ఆయుధాలతో దోపిడీకి ప్లాన్ చేసిన భారతీయులు

ఇంకా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న ఎన్నికలను అమెరికా నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. బైడెన్ పరిపాలనలో గత మూడేళ్లలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం అయ్యాయని వివరించారు. భారత్‌తో తమ సంబంధం చాలా సన్నిహితంగా ఉందని, మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీతో స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలని బైడెన్ భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇండో-పసిఫిక్ క్వాడ్‌ను విస్తరించి రెండు దేశాల సైన్యాలు కూడా అనేక యుద్ధ విన్యాసాలలో పాల్గొన్నాయని గుర్తు చేశారు. మోడీ నాయకత్వంపై ఎంతో కృతజ్ఞతతో ఉంటామని పేర్కొన్నారు. ఇప్పటికే భారతదేశ విధానాలను అమెరికా ఎప్పటికప్పుడు పొగుడుతూనే ఉంది.