IND Playing XI vs WI for 5th T20I: వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. మొదటి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. తర్వాతి రెండు టీ20లు నెగ్గి సిరీస్ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసిన టీమిండియా ఐదవ టీ20 కోసం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ సొంతం అవుతుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ఫ్లోరిడాలోనే సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఊపుమీదున్నాడు. మూడో టీ20లో ఒక రన్ మాత్రమే చేసిన యశస్వి.. నాలుగో మ్యాచ్లో హాఫ్ సెంచరీ (84 నాటౌట్; 51 బంతుల్లో 11×4, 3×6)తో రాణించాడు. వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ (77; 47 బంతుల్లో 3×4, 5×6) కూడా గాడిలో పడ్డాడు. దాంతో చివరి మ్యాచ్లో కూడా వీరిద్దరే ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇషాన్ కిషన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్.. నాలుగులో తిలక్ వర్మ ఆడతారు. ఈ ఇద్దరు మంచి ఫామ్ కనబర్చుతున్నారు.
హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వరుసగా 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. వీరు ముగ్గురూ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ముఖ్యంగా సంజూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ పేస్ కోటాలో బరిలోకి దిగనున్నారు. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు జట్టులో చోటు ఖాయం కాగా.. మరో మణికట్టు యుజ్వేంద్ర చహల్కు షాక్ తగిలే అవకాశం ఉంది. నాలుగో టీ20లో భారీగా రన్స్ ఇచ్చిన చహల్ స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆడే అవకాశం ఉంది. కీలక టీ20 కాబట్టి విండీస్ ప్లేయర్స్ చెలరేగే అవకాశం ఉంది. అందుకే బిష్ణోయ్ని భారత్ బరిలోకి దించాలని ప్లాన్ చేస్తోందట. బిష్ణోయ్ బౌలింగ్ని విండీస్ ప్లేయర్స్ ఎక్కువగా ఆడలేదన్న విషయం తెలిసిందే. చహల్ స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఆడినా ఆశ్చర్యం లేదు.
భారత జట్టు (IND Playing XI ):
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.