Healthy Recipes: సాధారణంగా కారప్పొడిలో రకరకాల పప్పులు వాడుతుంటారు. కానీ, పత్యం ఉండే వారు లేదా పప్పులు పడని వారు కూడా తినగలిగేలా ఎలాంటి పప్పులు లేకుండా కేవలం ధనియాలు, ఎండు మిరపకాయలతో కమ్మని కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
* ఎండు మిరపకాయలు (గుంటూరు మిర్చి): 50 గ్రాములు
* ధనియాలు: 30 గ్రాములు
* జీలకర్ర: 1 టీస్పూన్
* మెంతులు: అర టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు (పొట్టుతో సహా): పావు కప్పు
* పసుపు: అర టీస్పూన్
* ఇంగువ: పావు టీస్పూన్
* కల్లుప్పు (లేదా సాల్ట్): రుచికి సరిపడా
* నూనె: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఎండు మిరపకాయలను శుభ్రంగా తుడిచి, మధ్యలోకి తుంపుకోవాలి. ఇలా తుంపడం వల్ల వేయించేటప్పుడు గింజలు లోపల వరకు చక్కగా వేగి కమ్మని రుచి వస్తుంది. తర్వాత స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలను వేసి చిన్న మంట మీద నిదానంగా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్లీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ధనియాలు వేయించాలి. అవి కాస్త వేగాక అందులో జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించి స్టౌ ఆపేయాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన మిర్చి, ధనియాల మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, ఇంగువ, సరిపడా కల్లుప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా పావు కప్పు వెల్లుల్లి రెబ్బలను (పొట్టుతో సహా) వేసి మిక్సీని పల్స్ మోడ్లో ఒకసారి తిప్పాలి. వెల్లుల్లి మరీ మెత్తగా అవ్వకుండా కారప్పొడిలో కలిసిపోయేలా ఉంటేనే రుచి బాగుంటుంది. ఈ కారప్పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే బయట రెండు నెలల వరకు, ఫ్రిజ్లో పెడితే నాలుగు నుంచి ఐదు నెలల వరకు తాజాగా ఉంటుంది.
దోశ మీద ఈ కారప్పొడిని చల్లి, కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కారప్పొడి, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందంటే నమ్మకండి. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ఈ కమ్మటి కారంపొడిని తయారు చేసుకొని టేస్ట్ చేయండి.
READ ALSO: Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!