Dum Biryani: బిర్యానీ అనగానే నోరూరని వారుండరు. ముక్క మెత్తగా.. మెతుకు పొడిపొడిగా.. మసాలాల ఘుమఘుమలతో సాగే ఆ రుచే వేరు. అయితే, ఇంట్లో బిర్యానీ చేయాలంటే గంటల తరబడి శ్రమించాలని చాలామంది వెనకాడుతుంటారు. కానీ, కేవలం ఒకే గంటలో, రెస్టారెంట్ స్థాయి రుచితో ‘హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ’ని సిద్ధం చేసుకోవచ్చని మీకు తెలుసా.. ఆ అమోఘమైన రుచి మీ సొంతం కావాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: X (Twitter) DOWN.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు..!
కావలసినవి:
బాస్మతి బియ్యం: అర కిలో
చికెన్: ఒక కిలో
ఉల్లిపాయలు: 3 (మీడియం సైజు)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: పావు కప్పు
టమాటాలు: 3
పుదీనా, కొత్తిమీర: తగినంత
మసాలా దినుసులు, కారం, పసుపు, ధనియాల పొడి, నెయ్యి: రుచికి తగినంత
తయారీ విధానం..
ముందుగా అర కిలో బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి, నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఉంచుకోవాలి. శుభ్రం చేసిన చికెన్ను ఒక కడాయిలో వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి నీరు పోయకుండానే 50 శాతం వరకు ఉడికించాలి. దీనివల్ల ముక్క మెత్తగా ఉండి, త్వరగా దమ్ అవుతుంది. ఎసరు కోసం నీటిని మరిగించి, అందులో ఉప్పు, నెయ్యి, నిమ్మరసం, కేవరా వాటర్ (మంచి సువాసన కోసం) వేయాలి. ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి 75-80 శాతం వరకు ఉడికించి వార్చుకోవాలి.
ఒక మందపాటి గిన్నె తీసుకుని, మొదట సగం ఉడికించిన చికెన్ వేయాలి. దానిపై టమాటా-పుదీనా-కొత్తిమీర-పెరుగు మిశ్రమం, మసాలా పొడులు కలిపి ఒక లేయర్లా సర్దాలి. దానిపైన ఉడికించిన అన్నాన్ని వేసి, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, కుంకుమపువ్వు పాలు చల్లాలి. గిన్నెపై టిష్యూ పేపర్లు పరచి, మూత పెట్టి స్టవ్ మీద పెనం ఉంచి దానిపై గిన్నెను పెట్టి 15-20 నిమిషాల పాటు తక్కువ మంటపై దమ్ చేయాలి. ఈ పద్ధతిలో చేసే బిర్యానీకి విడిగా గ్రేవీ అవసరం లేదు. చికెన్లోని మసాలాలే అన్నానికి అద్భుతమైన రుచిని ఇస్తాయి. వేడివేడి బిర్యానీని రైతాతో వడ్డిస్తే ఆ తృప్తైవేరు. ఇక ఆలస్యమెందుకు? ఈ ఆదివారం మీ ఇంట్లోనూ ఈ ఘుమఘుమలు ప్రయత్నించి చూడండి.
READ ALSO: Women Empowerment Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లలోకి రూ.10 వేలు వచ్చాయా!