Hyderabad: హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను విక్రయిస్తున్న ఓ ఘరానా ముఠాను రట్టు చేశారు. జిమ్కు వచ్చే యువతనే టార్గెట్గా చేసుకుని, తక్షణ కండరాల పెరుగుదల కోసం ఆశ చూపిస్తూ ఈ నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ మీడియాకు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నగరంలో స్టెరాయిడ్లు, అనధికార సప్లిమెంట్ల విక్రయాలపై పలు ఫిర్యాదులు రావడంతో టాస్క్ ఫోర్స్ బృందాలు నిఘా పెట్టి ఈ దాడులు నిర్వహించాయని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వీటిని తరలిస్తూ, విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరూ జిమ్ ట్రైనర్లు కావడం గమనార్హం. రోజూ జిమ్కు వచ్చే యువతకు వీరు తప్పుడు సమాచారం ఇస్తూ, బాడీ త్వరగా ఫిట్ అవుతుందనే భ్రమలు కల్పించి ఈ ప్రమాదకరమైన ఇంజెక్షన్లను, సప్లిమెంట్లను అంటగడుతున్నట్లు డీసీపీ వివరించారు.
ఈ ముఠాలో బట్టే శివా అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, గతంలో ఇతనికి సొంతంగా జిమ్ ఉండేదని పోలీసులు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. “అది క్లోజ్ అయిన తర్వాత వివిధ జిమ్లలో ట్రైనర్గా చేరుతూ ఈ దందాకు తెరలేపాడు. ఈ ముఠాకు సప్లిమెంట్లు, ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్న ప్రధాన డీలర్లను సైతం పోలీసులు గుర్తించాం. దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఈ స్టెరాయిడ్లను హైదరాబాద్కు అక్రమంగా రప్పిస్తున్నట్లు తేలింది. మరింత విస్తుపోయే విషయం ఏంటంటే.. ఈ ముఠా ఏఐ (AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను ఉపయోగించి నకిలీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను సృష్టించి, తద్వారా ఈ మందులను చలామణి చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నాం. ఈ సరఫరాదారులైన మరో ఇద్దరిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీసీపీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిమ్ ఓనర్లు, ట్రైనర్లు, ముఖ్యంగా యువతకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ముఖ్యమైన సూచన చేశారు. అర్హత గల డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేదా సలహా లేకుండా ఇలాంటి స్టెరాయిడ్లు, సప్లిమెంట్లను వాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు. వీటిని వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన సైకలాజికల్ సమస్యలు (మానసిక రుగ్మతలు) తలెత్తుతాయని, అలాగే క్యాన్సర్ బారిన పడటంతో పాటు కాలేయం, కిడ్నీలు వంటి మల్టీ ఆర్గాన్స్ (ముఖ్య అవయవాలు) పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపాదన కోసం యువత ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

