AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..

Hydra Commisinar Ranganath

Hydra Commisinar Ranganath

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. భూవివాదం , కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన కఠిన ఉత్తర్వులపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధిస్తూ సస్పెండ్ చేసింది.

అసలు వివాదంలోకి వెళ్తే.. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన స్థలంలో హైడ్రా చేపట్టిన చర్యలు , నిబంధనల ఉల్లంఘనపై న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై తీవ్రంగా పరిగణించిన సింగిల్ జడ్జి రంగనాథ్‌కు జరిమానా విధించడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ తీర్పుపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చి ఊరట లభించింది.

మరోవైపు ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రంగనాథ్‌కు, హైడ్రాకు పూర్తి మద్దతుగా నిలిచారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా చట్టబద్ధంగానే బాధ్యతాయుతంగా పనిచేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే, ఆక్రమణదారులపై చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని, హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. హైడ్రా ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తోందని, నిబంధనల ప్రకారమే ప్రతి చర్య ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.